పుట:Oka-Yogi-Atmakatha.pdf/720

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

684

ఒక యోగి ఆత్మకథ

“స్వామీ, మీరు పిల్లల్ని మధుర తీసుకువెళ్ళినట్టుగా నన్ను శ్రీరంగం ఉత్సవానికి తీసుకు వెళ్ళగూడదా?” అంటూ అవినయంగా అడిగాడు.

సదాశివులు అతని కోరిక మన్నించారు; మరుక్షణంలో ఆ యువకుడు, ఎంతో దూరాన ఉన్న శ్రీరంగనగర జనసమ్మర్దంలో ఉన్నానని గమనించాడు. కాని పాపం! అతను తిరిగి వెళ్ళిపోవాలనుకున్న సమయానికి ఆ సాధువు ఎక్కడున్నాడు? చివరికి, ఈదురో గోడామని కాళ్ళీడ్చుకుంటూ ఇంటికి చేరాడతను.

దక్షిణ భారతంనుంచి వచ్చేముందు శ్రీ రైటూ నేను శ్రీ రమణమహర్షి దర్శనానికి తిరువణ్ణామలై దగ్గరున్న అరుణాచలమనే పుణ్యగిరికి యాత్ర చేశాం. ఆ మహర్షి మమ్మల్ని తమ ఆశ్రమంలో ఆప్యాయంగా ఆదరించారు. పక్కనే బొత్తిపెట్టి ఉన్న ‘ఈస్ట్-వెస్ట్’ పత్రిక సంచికల వేపు చూపించారు. వారితోనూ శిష్యులతోనూ మేము గడిపిన కొద్దిగంటల కాలంలో వారు, చాలావరకు మౌనంగానే ఉన్నారు; వారి సౌమ్య ముఖం దివ్యప్రేమనూ జ్ఞానాన్ని ప్రసరింపజేస్తోంది.

బాధలు అనుభవిస్తున్న మానవులు, తాము మరిచిపోయిన పరిపూర్ణతాసిద్ధిని తిరిగి పొందడానికి – “నేను ఎవర్ని?” అన్న ప్రశ్న నిరంతరం వేసుకుంటూనే ఉండాలని ఉద్బోధిస్తారు శ్రీ రమణులు; ఇది నిజంగా గొప్ప ఆత్మవిచారం. భక్తుడు ఇతర ఆలోచనల్ని కఠోరంగా తిరస్కరించి తన సత్యాత్మలోకి బాగా లోతుగా వెళ్ళగలుగుతాడు; పక్కదారి పట్టించే ఇతర ఆలోచనల భ్రమలు ఇక ముసరడం మానేస్తాయి. ఈ దక్షిణ భారత మహర్షి ఇలా రాశారు: