పుట:Oka-Yogi-Atmakatha.pdf/577

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అధ్యాయం : 34

హిమాలయాల్లో

మహాభవన సృష్టి

“బాబాజీ మొట్టమొదటిసారిగా లాహిరీ మహాశయుల్ని కలుసుకున్న వృత్తాంతం, మైమరిపించే కథ; మరణంలేని మహాగురువుల గురించి వివరంగా తెలిపే వాటిలో అది ఒకటి.”

ఒక అద్భుత కథకు ఆముఖంగా, ఈ మాటలు అన్న వారు స్వామి కేవలానందగారు. ఆయన మొట్టమొదటిసారి ఈ కథ చెప్పినప్పుడు నేను అక్షరాలా మంత్రముగ్ధుణ్ణి అయాను. అనేక ఇతర సందర్భాల్లో కూడా ఈ కథ మళ్ళీ చెప్పమని సౌమ్యమూర్తులయిన నా సంస్కృతం ట్యూటరుగారిని కోరాను; దరిమిలా, శ్రీయుక్తేశ్వర్‌గారు కూడా, వస్తుతః అవే మాటలు చెప్పారు. లాహిరీ మహాశయుల శిష్యులయిన వీరిద్దరూ ఈ అద్భుత కథను సూటిగా తమ గురుదేవుల నోటినించే విన్నారు.

“బాబాజీని నేను మొట్టమొదటిసారి కలుసుకున్నది, నాకు ముప్పై మూడో ఏట,” అని చెప్పారు లాహిరీ మహాశయులు. 1861 శరత్కాలంలో నేను దానాపూర్‌లో ఉండేవాణ్ణి. గవర్నమెంటు మిలటరీ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంటులో ఎకౌంటెంటుగా పని చేస్తూండేవాణ్ణి. ఒకనాడు పొద్దున మా ఆఫీసు మేనేజరు నన్ను పిలిపించాడు.

“ ‘లాహిరీ, మన ప్రధాన కార్యాలయం నుంచి ఇప్పుడే ఒక తంతి