పుట:Oka-Yogi-Atmakatha.pdf/489

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అధ్యాయం : 28

కాశీ పునర్జన్మ, వెల్లడి

“నీళ్ళలోకి దిక్కండి. బకెట్లు ముంచుకుని స్నానాలు చేద్దాం.”

నేను మా రాంచీ కుర్రవాళ్ళకు చెప్పిన మాటలివి; దగ్గరలో ఉన్న కొండకు వెళ్ళడానికి నాతోబాటు ఎనిమిదిమైళ్ళు నడుచుకుంటూ వచ్చారు వాళ్ళు. ఎదురుగా ఉన్న నీటి మడుగును చూస్తుంటే మమ్మల్ని రమ్మని పిలుస్తున్నట్లే ఉంది అది; కాని నా మనస్సులో దానిమీద ఒక రకం విరక్తి కలిగింది. చాలామంది పిల్లలు బకెట్లు ముంచుకోడం మొదలుపెట్టారు; కాని కొందరు కుర్రవాళ్ళు చల్లటినీళ్ళు కలిగిస్తున్న వ్యామోహానికి లోబడిపోయారు. వాళ్ళలా నీళ్ళలో మునిగారో లేదో, పెద్ద పెద్ద నీటి పాములు వాళ్ళ చుట్టూ అల్లల్లాడాయి, ఏం అరుపులు! ఏం చిందులు! మడుగులోంచి బయటపడ్డానికి వాళ్ళు చూపిన ఆత్రం ఎంత వినోదం కలిగించిందో!

చేరవలసిన చోటికి చేరిన తరవాత మేము ఆనందంగా వనభోజనం చేశాం. నేను ఒక చెట్టుకింద కూర్చున్నాను; కుర్రవాళ్ళు నా చుట్టూ కూర్చున్నారు. నేను ఉత్తేజకరమైన మనఃస్థితిలో ఉండడం చూసి వాళ్ళు ప్రశ్నల వర్షం కురిపించారు.

“ఏమండీ, నేను ఎప్పటికీ వైరాగ్య మార్గంలో మీతోనే ఉంటానా? చెప్పండి స్వామీజీ?” అని అడిగాడు ఒక కుర్రవాడు.