పుట:Oka-Yogi-Atmakatha.pdf/445

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అధ్యాయం : 25

అన్నయ్య అనంతుడు,

చెల్లెలు నళిని

“అనంతుడింక బతకడు; ఈ జన్మకు అనుభవించవలసిన కర్మ తీరిపోయింది.”

ఒకనాడు పొద్దున నేను గాఢమైన ధ్యానంలో మునిగి ఉండగా, ఈ ఘోరమైన మాటలు నా అంతశ్చేతనలోకి చేరాయి. నేను సన్యాసం తీసుకున్న కొత్తలో, నా జన్మస్థలమైన గోరఖ్‌పూర్‌లో ఉన్న మా అనంతన్నయ్యకి అతిథిగా వెళ్ళాను. హఠాత్తుగా ఏదో జబ్బుచేసి మంచం పట్టాడతను; నేను ప్రేమగా అతనికి ఉపచారాలు చేశాను.

గంభీరమైన ఈ అంతర్ఘోష నన్ను దుఃఖంలో ముంచేసింది. నా కళ్ళముందే అన్నయ్యని తీసుకుపోబోతూంటే నేను నిస్సహాయుడిగా చూస్తూ ఉండాలంటే, గోరఖ్‌పూర్‌లో అట్టేకాలం ఉండడం నాకు దుర్భర మనిపించింది. నన్ను అర్థంచేసుకోకుండా బంధువులు విమర్శ చేస్తున్నప్పటికీ నాకు దొరికిన మొదటి ఓడ ఎక్కి భారతదేశాన్ని విడిచిపెట్టాను. ఆ ఓడ బర్మా, చైనా సముద్రంగుండా జపాను చేరింది. నేను కోబేలో దిగి, కొన్నాళ్ళక్కడ గడిపాను. దుఃఖంతో గుండె బరువెక్కి ఉన్నందువల్ల బయట తిరిగి ఏవీ చూడాలని కూడా అనిపించలేదు.

భారతదేశానికి తిరుగు ప్రయాణంలో మా ఓడ షాంఘై చేరింది.