అధ్యాయం : 19
కలకత్తాలో ఉన్న గురుదేవులు
శ్రీరాంపూర్లో కనిపించడం
“నాస్తిక శంకలు నన్ను తరచుగా చుట్టుముడుతుంటాయి. అయినా ఆత్మకు సంభావ్యమైన విషయాల్లో మనం ఇంతవరకు అనుభూతం చేసుకోనివి ఉండే అవకాశం ఉందా లేదా అన్న ఆలోచన అప్పుడప్పుడు తలఎత్తి నన్ను వేధిస్తూ ఉంటుంది. మానవుడు వాటిని కనుక్కోకపోయినట్లయితే తన వాస్తవ భవితవ్యానికి దూరం కాడా?”
ఈ మాటలు అన్నవాడు దిజేన్బాబు. ‘పాంథీ’ వసతి గృహంలో అతను నాతోబాటు ఒకే గదిలో ఉండేవాడు. మా గురుదేవుల్ని దర్శించడానికి రమ్మని నేను ఆహ్వానించినప్పుడు అతనన్న మాటలవి.
“శ్రీయుక్తేశ్వర్గారు నీకు క్రియాయోగ దీక్ష ఇస్తారు,” అంటూ నేను, “అది, దివ్యమైన అంతరిక విశ్వాసంద్వారా ద్వంద్వప్రకృతివల్ల కలిగే సంక్షోభాన్ని అణచివేస్తుంది.” అన్నాను.
ఆవేళ సాయంత్రం దిజేన్, నాతోబాటు ఆశ్రమానికి వచ్చాడు. గురుదేవుల సన్నిధిలో మా స్నేహితుడికి ఎంత ఆధ్యాత్మిక ప్రశాంతి లభించిందంటే, అప్పటినుంచి అతను తరచుగా ఆశ్రమానికి రావడం మొదలైంది.
నిత్యజీవితంలో చేసుకొంటూ ఉండే చిల్లరమల్లర పనులు, మన