228
ఒక యోగి ఆత్మకథ
శ్రీ యుక్తేశ్వర్గారు కూడా నిర్బంధాల్ని ఉపేక్షించడం, అంత ఘనంగా కాకపోయినా అంతకన్న తక్కువ స్థాయిలో వెల్లడిఅయింది. తల్లిగారు గతించిన తరవాత ఆయన, కాశీలో పవిత్రమైన గంగానది ఒడ్డున దహనకాండ ఏర్పాటుచేయించి, గృహస్థ ధర్మం ప్రకారం అనేక మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేయించారు. సంకుచితమైన అనుబంధాల్ని అధిగమించడానికి సన్యాసులకు తోడ్పడ్డంకోసం ఉద్దేశించినవి శాస్త్రీయమైన నిషేధాలు. శంకరులు, శ్రీ యుక్తేశ్వర్గారు తమ అస్తిత్వాల్ని వైయక్తికతారహితమైన చిచ్ఛక్తిలో సంపూర్ణంగా విలీనం చేసుకొన్నారు; నియమాన్ని ఆశ్రయించుకొని రక్షణ పొందవలసిన అవసరం వారికి లేదు. ఒక్కొక్కప్పుడు ఒకానొక గురువు, విధికి ఏర్పడ్డ రూపం కన్న, దాని నియమం ఘనమైనదని నిరూపించడం కోసం, కావాలని దాన్ని ఉపేక్షిస్తాడు. ఆ విధంగా ఏసుక్రీస్తు, విశ్రాంతి రోజున ధాన్యంకంకులు కోశాడు. అనివార్య విమర్శకులకు ఆయన ఇలా చెప్పాడు: “విశ్రాంతి రోజు (సబ్బత్) ఏర్పడ్డది మనిషికోసంకాని, మనిషి విశ్రాంతిరోజుకోసం కాదు.”[1]
పవిత్ర గ్రంథాలు తప్పించి, శ్రీ యుక్తేశ్వర్గారు చదివింది స్వల్పం. అయినప్పటికీ ఆయనకు అత్యంత అర్వాచీనమైన వైజ్ఞానిక ఆవిష్కరణలు, జ్ఞానపరమైన ఇతర ప్రగతులు తప్పనిసరిగా పరిచయమై ఉండేవి.[2] అద్భుత సంభాషణా చతురులైన ఆయన, తమ అతిథులతో