పుట:Neti-Kalapu-Kavitvam.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

166

వాఙ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం


అణగినప్పుడే ధర్మం స్థిరవికాసంతో ప్రకాశిస్తున్నది. ధర్మంతో సమస్త కల్యాణగుణాలూ వికాసం పొందుతున్నవి.

ముందు శృంగారాధిదేవతగా వెలయబోతూ అరణ్యస్థలిలో ప్రియసంయోగం కొరకు తపస్సాచరించే పార్వతియందు ప్రియుడైన పరమేశ్వరుడికి కామాన్ని తొక్కినిల్చున్న ధర్మమే గోచరించి.

"అనేన ధర్మః సవిశేషమద్య మే
 త్రివర్గసారః ప్రతిభాతి భావిని,
 త్వయా మనో నిర్విషయార్ధకామయా
 యదేక ఏవ ప్రతిగృహ్య సేవ్యతే".

(ఓపార్వతీ! ఇందువల్ల ధర్మమే త్రివర్గసారమైనట్టు నాకు తోస్తున్నది. యెందువల్లనంటే; అర్థకామాలు తలపెట్టకుండానే ధర్మాన్ని ఒక్కదాన్నే ప్రతిగ్రహించి నీవు ఆరాధిస్తున్నావు) అని అంటాడు.

ఓ పార్వతీ! ధర్మార్ధకామాల్లో ధర్మసారత్వం నేడు నాకు కనబడుతున్నది. అర్ధకామాలను అధఃకరించిన నీవు దాన్ని (ధర్మాన్ని) ఒక్కదాన్నే అరాధిస్తున్నావు అని అభిప్రాయం తెలుపుతాడు. పశుత్వద్యోతకమైన కామం అడుగుకుపోయిన తరవాత ధర్మం ఆలంబనం అయిన సమయాన పార్వతీపరమేశ్వరుల సంయోగాన్ని కుమారసంభవంలో ఆరాధించిన కాళిదాసు

"అప్యర్థకామౌ తస్యాస్తాం ధర్మ ఏవ మనీషిణః" (రఘు)

ఆ దిలీపమహారాజుకు అర్ధకామాలుగూడా ధర్మమే అయినవి.

అని వేరొక చోట అంటాడు ఇట్లా అర్ధకామాలను సేవకులుగా జేసుకున్న ధర్మసారత్వాన్ని కాళిదాసు అనేకస్థలాలల్లో తన కవితాసర్గంలో ప్రకటిస్తాడు.