పుట:Neti-Kalapu-Kavitvam.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ర స్తు.

వాఙ్మయపరిశిష్టభాష్యం.

వ్యతిక్రమాధికరణం.

వ్యతిక్రమం.

ఛందోవ్యతిక్రమం. భాషావ్యత్రిక్రమం అనే దోషా లీకృతుల్లో కనబడుతున్నవి. వీటిని వివరిస్తాను. సంస్కృతంనుండి తర్జుమాతో ఆరబ్దమైన ఆంధ్రగ్రంధపఠనంలో సంస్కృతం ప్రవేశించడం సంభవమే గనుకను, అదిగాక ఆంధ్రులభాష సంస్కృతంతో మిళితమై వున్నది గనుకను, సంస్కృతం ఆంధ్రులకృతుల్లో కనబడడం స్వభావవిరుద్ధం గాదు. తెలుగు సంస్కృతంతో మిళితమైన భాష గనుక తర్జుమా చేసేటప్పుడు మూలగ్రంథకారుడి అభిప్రాయం యథాస్థితంగా వచ్చేటట్లు పద్యంలో వ్రాయడానికి ఒక్కొకచోటసంస్కృతం వాడడం వుచితంగానే వుండవచ్చును. యెందుకంటారా? పద్యానికిగల నియతస్థలంలో నియతగతిలో ఆమాట లక్కడ యిమిడి ప్రసన్నంగా వుండడం ఒక్కొక్కప్పుడు సంభవిస్తుంది. అయితే ఆంధ్రులభాష ప్రధానంగా తెలుగు. తెలుగుభాషాతత్వానికి విరుద్ధంగాకుండా వుండేమటుకే సంస్కృతం తెలుగులో యిముడుతుందిగాని తక్కినది యిమడని పదార్ధంగానే అసంబద్దంగానే వుంటుంది. తెలుగుభాషయొక్క తత్వం సాధారణంగా వ్యప్తపదత్వం పదాలు రెండు మూడు, అంతగా యెక్కువైతే నాలుగుకంటె యెక్కువ సాధారణంగా చేరవు. అవి సయితం సంస్కృతంలో వలెవిభక్తిలోపంతో దగ్గరికిచేరి బిగిసినవికావు. తెలుగులో దగ్గరగా చేరేపదాలన్నీ చాలామటుకు వ్యప్తపదాలే అయివున్నవి. సంస్కృతంలో సయితం వ్యాసుడు, వాల్మీకి, కాళిదాసుడు మొదలైనవారి