పుట:Neti-Kalapu-Kavitvam.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

114

వాఙ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం


సమాధానం

చెప్పుతున్నాను మంచిది. చరిత్రలుంటే వుండవచ్చు ఇవి చరిత్రలంటే నాకు విచారణేలేదు. కవిత్వమన్నప్పుడే విచారణ. దేశాన్ని తమఃకూపంలో బడవేసే అవివేకాన్ని నిరోధించి స్వకాలమందలి ప్రజాప్రవృత్తిమీద ఆచరణరూపాన ప్రతిక్రియసాగించే వ్యక్తులు తమఖేదాన్ని తమ అనుభవాలను నిర్వేషంగా భర్తృహరివలె చెప్పవలసిన సమయాలు తటస్థించగలవు వాటికి లోకం అంధం కాజాలదు కాని, రసభావాల పరిపోషం, శిల్పం, వికసితలోకవృత్తప్రదర్శనం, మొదలైన వాటితో విశిష్టమైన కవితా సర్గానికి భర్తృహరివలె లోకప్రవృత్తి విషయమయి ఖేద మోదానుభవం చెప్పడం సంబంధించిందిగాదు. కవితా లోకంలో కాళిదాసు స్థానం భర్తృహరికిలేదు. శక్తిమంతులు అదీయిదీ రెండూ నిర్వహించవచ్చును. లేదా మహాకవులు కాళిదాసాదుల వలె తము సృజించినకవితా లోకంలోనే తమసందేశాలను స్ఫుటంగా వ్యంగ్యంగా పాత్రలద్వారా మధ్యమధ్య స్వీయవాక్యాలద్వారాప్రతి పాదించవచ్చును. భవభూతివలె కవితాభావనలలోనె నూతనత్వాన్ని "ఏకోరస।" అన్నట్లు తెలుపవచ్చుని కాని "నాకు" అని "నేను" అనిమాత్రం తమనే కవులు శృంగారాదులకు నాయకులను జేసుకున్నప్పుడు దృష్టి తప్పక సంకుచితం కాగలదు. ఇవి సొంత చరిత్రలంటే నాకు విచారణేలేదు. యెవరిచరిత్రలు వారు వ్రాసుకొనడానికి యేమీ ఆక్షేపంలేదు. కాని యిదంతా నూతనకవిత్వం ఉత్తమకవిత్వం అంటే, కాదు దృష్టిసంకోచ మంటున్నాను.

నేటి కృతికర్తలపద్యాల్లో ఈసంకుచితదృష్టే అధికంగా కంబడుతున్నది. పోతన, భర్తృహరులవలె తెలిపే ఆత్మదృష్టసత్యాలు లోకశ్రేయస్సుకు కారణమైనవి ఉన్నవేమో నని పరిశీలించాను గాని నాకు కనబడలేదు. ఆవిధపు సత్యాలెక్కడైనా ప్రకటితమైనవేమోనని