పుట:Navanadhacharitra.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xxxvii

రాజమహేంద్రునియొద్ద గోపాలకుఁడై యుండిన "గోరక్షకుఁడు" తొలుత మీననాథునిఁ జూచినప్పుడు తాను గోవులను గాచు రీతులను గూర్చి చెప్పికొనినమాటలు విరాటపర్వమునఁ దిక్కనార్యుఁడు సహదేవునిచేఁ బలికించిన పలుకులను దలఁపించుచున్నవి.

మొత్తముమీఁద శైవసిద్ధులగు నవనాథుల చరిత్ర నుద్ఘాటించుటె ప్రధానముగాఁ గల యీ గ్రంథమున సందర్భానుకూలములు రసానుగుణములు నగు వర్ణనములు భావములును గనఁబడుచున్నను, హరిశ్చంద్ర ద్విపద యీకవి రచనాప్రౌఢీని వెల్లడించుచు సరససాహిత్య లక్షణ విచక్షణత్వమును సార్థకము చేయుచున్నదనక తప్పదు.

భాషావిశేషములు-

ఆంధ్రమునఁ బద్యప్రబంధ రచన కాదరము పెరుగుచున్న కాలమున దేశీయచ్ఛందమగు ద్విపదలోఁ బ్రౌఢకవిత్వమును వెలయించినవాఁడు గౌరన. అందు నంతకుఁ బూర్వము పద్యకావ్యముగ నున్న దానినె యందలి కథలను సర్వజనసామాన్యములుగఁ జేయుటకై ద్విపదగా రచించెను.

"ఒప్పదు ద్విపద కావ్యోక్తి నావలదు,
 అట్టునుగాక కావ్యముప్రౌఢిపేర్మి
 నెట్టన రచియింప నేర్చినఁ జాలు
 నుపమింప గద్యపద్యోదాత్తకృతులు
 ద్విపదలు సమమ భావింప.”

అని సోమనాథుఁడు. చెప్పినట్లీతఁడును వీనిని బ్రౌఢిపేర్మిని రచియించి గద్య పద్యోదాత్త కృతులతో సమముగానే చేసినాఁ డనవచ్చును. ఈ ద్విపద రచనలో సోమనాథునివలె గౌరన ప్రాసయతిని బ్రయోగించుటకుగాని, ద్విపదతోద్విపదసంధిల నేకశబ్దమును బ్రయోగించుటకుగాని యంగీకరింప లేదు, కాని సామాన్యముగా శివకవుల రచనలయం దగపడు ప్రయోగవిశేషములు కొన్ని యీతని రచనలలోఁ గానవచ్చుచునే యున్నవి. వ్రాఁతప్రతులనుబట్టి చూడఁగా శైవకవులు ప్రయోగించుచుండు వర్గప్రాసము నతఁడు ప్రయోగించెనేమో యను సందేహమునకుఁ దావిచ్చు ప్రదేశము లొండు రెండు కలవు.

సబిందు నిర్బిందు ప్రాసము నీ కవి తఱచుగాఁ బ్రయోగించియే యున్నాఁడు. బాగు, తీఁగెలకుఁ బ్రాసగూర్చినాడు. రేఫద్వయప్రాసము విషయమునఁ గూడ నీతనికిఁ బట్టింపు లేదు.