పుట:Navanadhacharitra.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xxxvi

             దంతకుండలముల తళుకులు మెఱసి
             వింతగాఁజెక్కుల వెన్నెలల్ గాయ
             ..... ..... ..... ..... ..... ..... ..... ..... .....

హరిశ్చంద్రలో “విద్యలవార "మని చెప్పికొనిన మాతంగకన్యల వర్ణనము వారుచూపిన సంగీత విద్యాకౌశలమునకుఁ దగిన రచనాప్రౌఢిమ గలదై యున్నది. వీరి నవ్యగీతామృత లహరికి వీణాదండము చిగురొత్తినది, హార మాణిక్యములు గరఁగినవి, వన్నె చిత్రములుచైతన్యమును బొంది తలలు గదల్చినవి. ఇఁక వీరికిని హరిశ్చంద్రునకును జరిగినసంభాషణరీతి గూడఁ బ్రౌఢప్రబంధ రచనలను దలఁపించుచున్నది.

            “ఈ రత్న భూషాదు లేటికిమాకు,
             నీరువ ట్టాఱునే నెయిద్రావికొనిన.
             ..... ..... ..... ..... ..... ..... ..... ....."

ఇంకను నిట్టి జాతీయపద ప్రయోగము లిందు నవనాథచరితమునకంటె విశేషముగాఁ గనఁబడుచుండుటచే నిది కవియొక్క భావరచనాపరిణతిని నూచించుచున్నదని తలంపవచ్చును.

           “ఱంతుగా నాఁబోతు ఱంకెవేసినను
            గంతులుతక్కునే కంఠీరవంబు,
            వారికి మనతోడ వైరంబుఁ బూని,
            పోరాడ నేధనంబులు పొత్తువోవు?'
           “భూపకీటమ వేరు పురుగవై తీవు
            కొఱవి నౌ దల గోకికొంటివి క్రొవ్వి”
            తమకించి లోహశోధనము లాఁకటికి
            నమలవచ్చు నెటు మైనపుదంతములకు”
          “నిప్పును జెదలంట నేర్చునే మాకు.”
           "వల్లెత్తిఎలుకలఁ బట్టనోపినను
            పిల్లి శాస్త్రమె మంటిపిల్లియే చాలు”
          “నేఁ గినిసితినేని, చక్కబెట్టఁగలేరు సాదురేఁగినను
           బొక్కి నిల్వదు తల పొలమునఁగాని”

ఈ తుదివాక్యము తిక్కనార్యుని భారతమునందలి యీ క్రింది పద్యమును దలఁపించుచున్నది. ఉద్యో -2-13)

          “అనుజులకు నడ్డపడి యే
           మినిజేయఁగ నేమిఁ జూచి మెచ్చితిగా కీ
           వును సాదు రేఁగెనేని
           న్విను తలపొలమునన కాని నిలువదు సుమ్మీ”