పుట:Narayana Rao Novel.djvu/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మనుగుడుపులు

75

మొదలగు బహుమతు లర్పించి పంపిరి. వారి నౌకరులకుగూడ దలకు మొలకు గట్ట నిచ్చిరి.

అల్లుని చూడగానే జమిందారుగారి వదనము ప్రఫుల్లమయ్యెను. మధ్యహాలులో శ్రీనివాసరావు గారు, మృత్యుంజయరావుగారు, సీతారామాంజనేయ సోమయాజులుగారు, ఆనందరావుగారు, భాస్కరమూర్తి శాస్త్రిగారు, బసవ రాజరాజేశ్వర శ్రీ జగన్మోహనరావు జమిందారుగారు, రంగారావు దేశముఖు గారు, నారాయణరావు, జమిందారుగారు, నారాయణరావు రెండవ బావ మఱది వీరభద్రరావు మొదలగు వారందఱు సోఫాలపై నధివసించి కొంతతడవు ఇష్టాగోష్ఠి సల్పిరి. నారాయణరావు మాటలాడక యన్నియు వినుచుండెను. శ్రీనివాసరావుగారు తన వైపు తిరిగి తన్ను ప్రత్యేక మప్పుడప్పుడు ప్రశ్నించుచుండుటచే నారాయణరావు గంభీరములు, నాలోచనాపూరితములునగు సమాధానములు చెప్పుచుండెను. నారాయణరావు స్నేహితుడగు రాజేశ్వరరావు నాయుడుగూడ నప్పడేవచ్చి యందఱకు నమస్కృతు లొనరించి యచ్చట గూర్చుండెను.

రైళ్ళవిషయమై సంభాషణ నడచుచుండెను.

శ్రీనివాసరావుగారు నారాయణరావును జూచి,

శ్రీని: ఏవండీ నారాయణరావు గారూ, చూశారూ! మరేమంటే మన దేశంలో రైళ్ళు కంపెనీల క్రింద వుండడం లాభమా, ప్రభుత్వం క్రిందఉండడం లాభమా?

నారా: ప్రభుత్వం క్రింద ఉండడమే లాభం.

శ్రీని: ప్రయివేటు కంపెనీలకు వుండే లాభాపేక్ష ప్రభుత్వానికి ఉండదనా మీ యభిప్రాయం?

నారా: ఆశ ఉండక పోవడమే కాదు. గవర్నమెంటు సాలీనా వచ్చే నికరాదాయం వృద్ధి చేసుకొని తద్వారా ప్రజలకు ఇతర సదుపాయాలు చేయవచ్చు.

మృత్యు: అయితే రైల్వేలుకూడ గవర్నమెంటు డిపార్టుమెంటై, ఎఱ్ఱటేపు పద్ధతి అమలులోకి వస్తే లాభాలనేవి వుంటాయా అని.

జమీ: ఆబుకారీ డిపార్టుమెంటు లాభసాటిగా లేదుటండీ?

శ్రీని: రైల్వేలు ప్రభుత్వం చేతిలోవుంటే చూశారూ, పెద్ద ఉద్యోగాలన్నీ ఇంగ్లీషువాళ్లకే కట్టబెట్టి వాళ్లందరికీ జీతాలు విపరీతంగా యిస్తారు. మరేమంటే ఆ సొమ్ము ఐ. సి. ఎస్. వాళ్ల జీతాలలాగ అంతా ఇంగ్లండే చేరుతుంది.

రాజే: కంపెనీ అయితేమాత్రం ఇప్పుడూ ఆ పనే జరుగుతోంది కాదా అండీ.