పుట:Narayana Rao Novel.djvu/340

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పరివర్తనము

339

చెప్పిననేమి సాంఘిక ధర్మ మర్థమయినదా? తన భార్యను జిన్నతనములో గలసికొనకయున్నచో, నామె ఆరోగ్యవంతురాలై యుండెడిదేమో? పుష్పవతి యగుట తరువాయిగ భారతీయుడు బాలికను గలియుటయేగదా!

భార్య బ్రతికినంత కాలము గోపురంధ్రీమతల్లి, ప్రేమజీవి! ఆమె నెరిగెనా తాను? ఆమె తన బిడ్డలకు దల్లియనుమాటయేకదా తనకు తెలిసినది. ‘పరమేశ్వరా! నా కర్తవ్యమేమి? తండ్రీ! ఈ పరీక్ష నీదా? నా వేదాంతము పరీక్ష చేయదలచుకొన్నావా? డబ్బుగణిస్తూ యింటిలో మూటలుకట్టే యీ విచిత్ర రోగినారాయణసేవ నీకు నచ్చినదా? నా హృదయం కల్మషం అయ్యే ఉంది చిన్నతనాన్నుంచిన్నీ. కాబట్టే నన్ను తరింప చెయ్యాలని వచ్చిన నా అన్నపూర్ణని నేను బ్రతికించుకోలేకపోయాను. నా బిడ్డలను తల్లిలేనివారిగా చేశాను’ అని రాజారావు క్రుంగిపోవుచుండెను.

చుట్టుప్రక్కల చుట్టాలు, సంబంధములు తీసికొనివచ్చి రాజారావుకు వివాహము చెయ్యవలెనని ప్రయత్నించిరి. రాజారావు ‘ఆమాట తల పెట్టకండి’ అని చెప్పినాడు.

రాజారావు పైకి ధైర్యముగ తిరుగుచునేయున్నాడు. ఇదివరకు నాటకములన్న నిష్టము లేదు. సంగీతములన్న కడుపులో త్రిప్పు. కవిత్వమన్న కనులు తిరుగును. కళయన్న నసహ్యము.

అయ్యో ఎంతకష్టము అని ఎవరైన అనినచో ‘ఏమిటి కష్టము? ఎవరికీ, ఆత్మకా?’ అని ప్రశ్నించేవాడు.

‘ఇతడు వట్టి పొడివేదాంతి? అని హేళన చేసేవాడు పరమేశ్వరుడు రాజారావును. సినిమాలకు వెళ్ళితే, ఎప్పుడైనా తన స్నేహితులతో వెళ్ళుట వారికొరకే. సంగీతపు కచ్చేరీలు మొదలగు నితర ఖుషీలకు వెళ్ళినను అందులకే.

అట్టి రాజారావు నేడు అబలయైనాడు. చంటిబిడ్డ ఏడ్చిన, అతని కన్నుల నీరు తిరుగును. కరుణార్ద్రములగు కథలువిన్న భరించలేడు. పురాణములన్నియు జదువ ప్రారంభించినాడు. చదువుచు జదువుచు దన్మయుడైపోవును. ఏమి యీ కవిత్వము అనును. రోగులు వారంతట వారిచ్చినచో ఫీజులు పుచ్చుకొనును, లేనిచో లేదు. చెవుల నుండి బిరడాతీసినట్లు సంగీతము వినును. కన్నులనుండి తెర తొలగినట్లు నాటకములు, సినిమాలు చూచును.

ఆత డిప్పడు తన హృదయమును గనుగొన్నాడు. నేడు తన వైద్యశాలలో నమర్చిన బాలకృష్ణుని లీలలు దనకర్థము సాగినవి. భగవద్గీతలో పురుషోత్తమ భావముయొక్క అర్థము గోచరింపసాగెను.

‘కృష్ణా! కృష్ణా! భక్తి లేని యీ హృదయమునకు భక్తి పరిమళము నిచ్చినావా, నా భార్యను గొనిపోయి?’ యని హృదయములో ననుకొనుచు కంటికి పెట్టిన జోడు తీసికొని కన్నులు నులుముకొని తలవంచి నమస్కరించినాడు.