పుట:Narayana Rao Novel.djvu/337

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

336

నారాయణరావు

పర: ఏమోలే! సంగీతపాటకుడివి నీకు తెలియాలి; మాకేం తెలుస్తుంది? పొగ కొట్టకుండా ఉండడానికి స - అ - రీ - ఆ!

లక్ష్మీ: అదేమిటి రా?

ఆలం: వీడు పద్యం మాట్లాడుతున్నాడా డాబుదొరా?

నారా: డాబుదొర కాదురా! డాగుదొర!

రాఘ: కుక్కలదొరా!

లక్ష్మీ: అల్లా అయితే పశువుల వైద్యుడవ్వాలి.

అందరూ ఇసుకతిన్నెలపై వసియించియుండిరి. రాజారావుమాత్రము తల వాల్చుకొని యేదియో ఆలోచనలలో మునిగి, స్నేహితులతో మాటలాడక కూర్చుండియున్నాడు. ఆలం రాజారావు ప్రక్క జేరి యాతనిచుట్టి ‘రాజా! నీ స్నేహితు లందరి హృదయాలు నిన్ను ఆవరించి ఉన్నాయోయి! నువ్వు దహించుకుపోతోంటే ఈ తురకబిడ్డ మోటుమనస్సు కూడా నీరయిపోతోంది. మా అందరిలోకి గట్టిమనన్సు నీది’ అన్నాడు.

రాజారావు బొటబొట కన్నీటి కాలువలైనాడు.

౧౧

పరివర్తనము

నారాయణుని తండ్రికి శస్త్రచికిత్స చేయునప్పుడు శ్యామసుందరీదేవి చెంతనేయున్న ది. తరువాత నారాయణుని దగ్గరకు వెళ్ళి ‘అన్నా! మీతండ్రి గారు భీష్ములవారులా ఉన్నారు. ఏమి బలం, ఏమి ధైర్యము! ఆ విగ్రహం ఏమిటి! మీ యిద్దరు కవలపిల్లలులా ఉన్నారు. నీకంటె ఇంక కొంచెం మాంచి కండలుగట్టిన మనిషి. ఆయన ముఖానకూడా కొంచెమయినా బాధ కనబరచకుండా ఉండడం నాకు ఎంతైనా ఆశ్చర్యమయిపోయింది. ఆయన పాదాలదగ్గిర కూర్చుండి ఆయనను ప్రతిరోజూ పూజ చేస్తే నాజన్మ తరిస్తుంది. ఆయన నాతండ్రికూడాను, అన్నా! నీ హృదయం నొవ్వలేదుకదా, నాన్నగారి బాధచూసి?’ అన్నది.

ఆమె కన్నులు కరుణార్ద్రములై ప్రేమపూరితములై యాతని దిలకించినవి.

నారాయణరా వామెకు అనంత కృతజ్ఞతతో నమస్కరించి ‘తల్లీ, నీ వింత ప్రేమమయి వేమిటమ్మా?’ యని తన కారుమీద నెక్కించి పంపెను.

శ్యామసుందరీ దేవి పరీక్షలకు జదువునప్పుడు రాజారా వెంతయో సహాయము జేయ నారంభించెను.

కాలేజి వదలి, యేడాదిపాటు వివిధ వైద్యాలయములలో విద్య సంపూర్ణము చేసికొని అమలాపురంపోయి వృత్తినారంభించిన వెనుక రాజారావు పట్టినది