26
నా రా య ణ రా వు
గడ్డవి, నాల్గు ఎఱ్ఱఅద్దకం పంచెలు పట్టుకువచ్చాను. ఇంకా ఉన్నాయి. అక్కయ్యలకీ, కన్న తల్లికీ, అమ్మడికీ, పిల్లలకీ, నీకూ నాకూను. కన్న తల్లి ఏదఱ్ఱా?’ ‘మందపల్లి మామయ్య గారింటికి వెళ్ళింది. వస్తూఉంటుంది’ అన్నాడు శ్రీరామమూర్తి. హృదయము వికసించి, యాతని మోము వెన్నెల వెలుగయినది. తమ్ముని గుణగణములు రోజుకు మూడు నాల్గుసారులు తక్కువ కాకుండ నితరులకడ నాతడు వర్ణన చేయుచుండును.
‘మా తమ్ముడున్నాడే వాడి దేహం, ఎంత వజ్రమో, హృదయం అంత నవనీతం సుమండీ! మా నాన్నగారి తెలివి తేటలు దశమి వెన్నెలైతే, మా వాడి జ్ఞానం పున్నమ వెన్నెలండీ! మనకు స్వరాజ్యమంటూ వస్తే మా వాడు ముఖ్యమంత్రి అవవలసిందే. నౌరోజీ, దాసు, నెహ్రూ, రాధాకృష్ణ, పట్టాభి, హాల్డేను మొదలైన వాళ్ళతో సమమైన బుఱ్ఱండీ’ అని యనుచుండును.
తాను లోభియయ్యు, దమ్ము డిట్లు ధనము వెచ్చించుటన్న నాతనికి బరమప్రీతి. అతని హృదయాంతరాళమున నణగిమణగియున్న యుత్కృష్ట గుణములన్నియు దమ్ముడగు నారాయణ రావుకడ జాగృతములై ప్రత్యక్షమైనవి.
ఈ సంగతియంతయు సూక్ష్మగ్రాహియగు నారాయణరావున కవగతమే!
‘పరమలోభి, గట్టిమనస్సువాడూ ఐన అన్న గారంటే అంత గౌరవం, అంత ప్రేమా ఏమిటా నారాయుడికి’ అని యాతని స్నేహితు లెన్ని సారులు గుసగుసలు వోయినారో!
‘ఏమిరా చిన్న బాబూ! నాన్న గారు పంపించిన అయిదువందలూ ఖర్చు చేసేశావా’ అన్నది తల్లి.
‘ఆఁ! ఇంకో నూటయాభై రూపాయల సరకు వీ. పీ. గా వస్తుంది, అమ్మా!’
‘కొడుకుసోద్యాలు చూసి సంతోషించడమేనా, మాకు నాల్గు మెతుకు లేవన్నా పారేయించేదున్నదా!’ అని యప్పుడే లోనికి లక్ష్మీపతితో వచ్చిన సుబ్బారాయుడు గారు భార్యను నవ్వుచు బ్రశ్నించినారు.
వేళాకోళములు చేయుటలో సుబ్బారాయుడు గారద్వితీయులు. అందులో భార్య నెప్పుడు బరిహాసములతో ముంచివేయుచుండును.
మా అక్కయ్య వంట చేసికొని కూచుంది. ఎనిమిదైనా మీరు లేవక పోతే! రోజూ ఎంత మొత్తుకొన్నా తొమ్మిదింటికైనా భోజనానికి లేచి రాని మీకు ఈ వాళ పట్న వాసాన్నుంచి అబ్బాయి, అల్లుడూ వచ్చారని, ఇంత తొందరగా జఠరాగ్ని కదిలింది!’
గుమ్మం దగ్గర నిలుచుండి నారాయణరావు కొని తెచ్చిన వింతలన్నియు గమనించు చుండిన జానకమ్మ గారి యక్క , లక్ష్మీనరసమ్మ గారు ‘మరది గారికి కొత్తటే అమ్మాయీ! ఉన్నదోటీ అనేదొహటీ’ అని పలికినది.