పుట:Narayana Rao Novel.djvu/247

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

246

నా రా య ణ రా వు

వదిఐదు మైళ్ళ దూరంలో ఉన్న నాసిక వచ్చేటప్పటికి గోదావరి రెండువందల అడుగుల వెడల్పున గొప్ప నదియైనది. ప్రతిష్ఠానంలో నాలుగువందల అడుగుల వెడల్పు, నిజామాబాదులో ఆరువందల అడుగుల వెడల్పు, భద్రాచలముదగ్గర మైలు, రాజమహేంద్రవరముకడ రెండుమైళ్ళు, ధవళేశ్వరముకడ నాలుగుమైళ్ళు, డెల్టాముఖమున ముప్పదిమైళ్ళు వెడల్పున్నది.’

పిమ్మట పండరీపురము, హైదరాబాదు, గోలుకొండ, ఒరంగల్లు మొదలగు ప్రదేశముల వింతలన్నియు కనులకు గట్టునట్లు పరమేశ్వరమూర్తి వర్ణించి చెప్పెను.

నారాయణరావు వివిధ దేశ ప్రజల యాచార వ్యవహారములు, వివిధ దేశములలో ఒంటలు, ప్రజల కట్టుబొట్టులు, వర్తకసరళి మొదలైన విషయముల గూర్చి యుపన్యాసము నిచ్చినాడు. ఉత్తరదేశ ప్రజలు సిక్కులు, కాశ్మీర దేశస్థులు, పంజాబీయులు, పఠానులు, సరిహద్దు పరగణాలవారు చాల బలమైనవారు. సంయుక్తపరగణాలవారు, మధ్యపరగణాలవారు, బిహారీయులు, రాజపుత్రులు, మహారాష్ట్రులు, ఆంధ్రులు రెండవరకమువారు. ఆఖరిరకము వంగము, అరవ, మళయాళములవారు. కన్నడులు రెండవరకమునకు, ఆఖరిరకమునకు మధ్య నుందురు.

అందమున మొదటివారు కాశ్మీరదేశ స్త్రీలు. మంగుళూరువారు, మైసూరు వైష్ణవులు తరువాత. తర్వాత మళయాళివారు, రాజపుత్రస్త్రీలు, కొంకణీయులు, గుజరాతీ, మహారాష్ట్ర. ఆంధ్ర, వంగ మొదలైన తక్కిన దేశముల వారు తర్వాత, దాక్షిణాత్య స్త్రీ లాఖరున వచ్చెదరు.

కట్టులలో ఆంధ్రస్త్రీల నేటి కట్టు చాల అందమైనది. తర్వాత మహారాష్ట్రపు కట్టు. అయ్యంగారికట్టు తర్వాత. కథైవారీలు, రాజపుత్రస్థానస్త్రీలు పరికిణీలు కట్టెదరు. సిక్కులు, కాశ్మీరదేశస్థ వనితామణులు లాగులు తొడుగుకొనెదరు. గుజరాతీ, ఉత్తరహిందూస్థానం, వంగదేశముల లలనలు చిన్నచీరలు కట్టెదరు. ఒక శాలువ పైన కప్పకొనెదరు. అందరికట్టుకన్న అసహ్యమగు కట్టు ఒరియా దేశ స్త్రీలు కట్టెదరు.

శుచిలో మలయాళిలు మొదట, ఆంధ్రులు రెండవవారు. తర్వాత తమిళ బ్రాహ్మణులు. తర్వాత కన్నడులు. తర్వాత మహారాష్ట్రులను వంగదేశపువారిని చెప్పవలెను. రాజపుత్రస్థానీయులు, పంజాబు, కాశ్మీరదేశస్థులు నాలుగవవారుగ వచ్చెదరు. ఒరియా దేశపువారు ఆఖరువారు. మురికిగుడ్డల ధరించి, పసుపునూనె కారుచుందురు.

ఆంధ్రులు, కన్నడులు భోజనమైనవెనుకమాత్రం తమలపాకులు ఉపయోగించెదరు. తక్కినవారందరు కాలనియమరహితముగా పొగాకుతో నుపయోగించెదరు. పొగాకు మసాళాల రూపమున వాడుదురు. వంటలలో ఎక్కువ ఖరీదుగల భోజనము గుజరాతీ భోజనము. పంజాబీయులు తరువాత.