పుట:Narayana Rao Novel.djvu/234

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బృందావనము

233

నాల్గవ గురువుగారి కాలములో నీ యాశ్రమము ప్రారంభింపబడి నేడు సర్వతోముఖముగ విజృంభించియున్నది. సత్సంగమతము ముఖ్యముగా మూడు విషయములు బోధించుచున్నది. మతము, సంఘము, పారిశ్రామిక విషయములు. పరమాత్మ శబ్దస్వరూపమై యున్నాడు. ‘రాధాస్వామి’ అని ఆయనశబ్దము, ఆశబ్దమైనను మన ముచ్చరింపజాలని, మనము వినజాలని అతీంద్రియశక్తికే గోచరించునట. కాని ఆస్వరూపమున భక్తులకొరకు పిండాండములో అనగా ఈ ప్రపంచములో నట్టిరూపమున దర్శనమైనదట. రాధాస్వామిదయాళునకు రూపము లేదు. ఆయన శబ్దమాత్రము. ఈ విశ్వమంతయు మూడు భాగములుగ విభజింపబడి యున్నదట. పిండాండము, బ్రహ్మాండము, శుద్ధచైతన్యము. పిండాండము భౌతికసంబంధము. బ్రహ్మాండము మనస్సంబంధమైనది. ఈ మూడు విభాగములు ప్రతిజీవిలో నున్నవి. పిండాండ విభాగము లందరకు దెలియును. బ్రహ్మాండములో ప్రథమము జ్ఞానచక్రము భ్రూమధ్యమున నుండును. అందుండి ఆత్మధార సహస్రారము, జ్యోతిర్నారాయణము, సున్న, మహాసున్న, వంకనాళములకు బోవునట. ఆపై శుద్ధచైతన్యము. అందు ప్రథమము భ్రమరగుహ, దానిపై సత్యలోకము, ఆగమ అలకలోకములు. అన్నిటికన్న పైన రాధాస్వామిధామము. అరిషడ్వర్గముల బారద్రోలి, రాధాస్వామిదయాళుని కృపవల్ల సులభముగ పిండాండము బ్రహ్మాండము దాటి శుద్ధచైత్యము జేరు యోగమార్గము సద్గురువు దెలిపెదరట. మన మా రాధాస్వామిదయాళుని పాదముల నమ్మియుండి, శబ్దములు పాడుచు, యోగమాచరించుచు, సంతులతో సత్సంగమాచరించుచు విశుద్ధజీవనము చేయుచుండినచో, ఈ మూడు ముఖ్యవిభాగప్రదేశములలో నున్న వివిధోపలోకములను దాటుచుబోయి సంతులు పరివేష్టించియుండు సంత సద్గురువువారి ధామము చేరుదుము. అచ్చటినుండి సంతసద్గురువే నిన్ను రాధాస్వామి ధామము చేర్చగల శక్తి గలవాడు. వివిధ ధామముల జేరునప్పు డచ్చట నుండి సంతదివ్యులు వివిధ ధ్వనులతో వివిధవర్ణ తేజస్సులై కన్పించెదరట. ఇది దయాలుబాగు సద్గురు మహారాజువారు బోధించు ఆధ్యాత్మిక తత్త్వము.

రెండవది సంఘసంస్కరణ. ఏమతమువారైనను సత్సంగులుకావచ్చును వారికి జాతి మత వర్ణ వివక్ష లుండరాదు. భోజన ప్రతిభోజనములకు వివాహములకు వర్ణము లడ్డమురావు. యువవివాహములు చేయవలయునుగాని, బాల్య వివాహములు పనికిరావు. అర్థములేని యీ నాటి ఆచారము లన్నియు త్రోసివేసి, శుభ్రతయే యాచారములకు ముఖ్యసూత్రముగా బరిగణింపవలయును.

ఎప్పుడు జాతి మత వర్ణ వివక్ష లుండవో, కలిమిలేముల తేడాలు నుండరాదు. సంఘమంతయు సంఘముకొరకు బాటుపడవలయును. ఆస్తియంతయు సంఘముది. సంపాదనయంతయు సంఘముదే. కావున సంఘమే వ్యక్తుల కుటుంబముల బోషించును. ఈ మహాసూత్రము నాచరించుటకై, దయాలుబాగులో వస్త్రములు, ఊటకలములు, కత్తులు, గ్రామఫోనులు, రంగులు, సీసాలు,