పుట:Narayana Rao Novel.djvu/231

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

230

నా రా య ణ రా వు


‘హిమాలయములలో తపస్సు చేసి మహత్తులు సంపాదించిన మహాఋషి మా గురువు, శ్రీ శ్రీ రూపగోస్వామి!’

‘అలాగా! అయితే ఈ పాట వినిపించండి ఆయనకు’ అని శ్రీ మీరా ‘పురుషు డెవ్వడు? శ్రీకృష్ణు డొక్కడే పురుషుడు, భక్తులందరు స్త్రీలు, పురుషునిలో లయమగుటకే తపస్సులు భక్తియున్ను’ అని పాట పాడినదట. శిష్యు లా పాటను గురువుగారికడకు బోయి వినిపించుటయు, నా స్వామి నిర్విణ్ణుడై యర్థము గ్రహించి ‘యేది నా తల్లి’ యని పరువులిడివచ్చి యామె పాదాలపడి ‘తల్లీ, సత్యసూత్రము నా కనుగ్రహించి నా గురువైనావు. మూర్ఖుడను. క్షమించు. స్త్రీలు మోక్షం భంగం చేసేవాళ్లు, ప్రకృతిస్వరూపిణులు అనుకొని, వీళ్ళను చూస్తే పురుషుని హృదయం మోసపడిపోయి దగ్ధమగునని తప్పుదారిని పడ్డాను’ అన్నాడు.

ఆ కథ స్మరించుకొనుచు నా పాట పాడుకొనుచు, తులసీవనము, యమునాఘట్టము, --ళీయహ్రదము, గోవర్థనము మొదలగునవి దర్శించినారు.

‘కృష్ణా కృష్ణా! గోపకుమారా!
బృందావన సంచారా!
మురళీమోహన, మృదుపదనర్తన
మోహనలీలాకారా!
సుందరనందకుమారా!
కృష్ణా కృష్ణా!’

యని పరమేశ్వరుడు పాడుచు ‘నారాయణా! యీ వెన్నెలగడియల్లో యమునాతీరాన్ని, రాసక్రీడాలోలుడైన శ్రీ వేణుగోపాలుని చూద్దామురా’ అన్నాడు.

నారాయణరా వా మాట వినుపించుకోలేదు. శ్రీ గోపాలకృష్ణ పరమేశ్వరుడు దివ్యబాలుడై యీ ప్రదేశముల నాడుకొన్నాడా? మోహార్తలగు వ్రజసుందరులకు సర్వసమర్పణ నేర్పినాడా? ప్రేమయనగా స్త్రీ పురుషుల పరస్పర వాంఛయేనా? మోహావేశమున తాను ప్రేమించు బాలికనే దేవస్వరూపమున నెంచి పూజించెదరా? ఎంతమౌఢ్యము! ప్రేమికులకు ప్రేమ భక్తియే కాదా! నిజమైన ప్రేమ ప్రతిఫలము కోరదు. నాథు డితరులను బ్రేమించుచున్నాడని కించపడదు, ఐక్యమే పరమావధిగా గోరును. ఆ ఐక్యభావము సార్థకమగుట ఒక భగవంతుని పాదముల మ్రోలనే కదా.

చిన్నతనాన ప్రేమయే భక్తియని భక్తియోగము గరిపిన నందబాలుడు, వెన్నముద్దలదొంగ, రాధికాహృదయనాథుడు, గోపికామనశ్చోరుడు, కురుక్షేత్రాన మహావేదసారము, ఉపనిషత్తుల నవనీతము, సాంఖ్యామృతము కలియబోసి, నిగ్గుతేల్చి సర్వమతాభిప్రాయాలు సమన్వయించి నరస్వరూపుడయిన