పుట:Narayana Rao Novel.djvu/177

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

176

నా రా య ణ రా వు

గదులు మేడపైనను, క్రిందను దక్షిణవైపున నున్నవి. మేడపైన తూర్పునగూడ కొన్నిగదు లున్నవి. వెనుకభాగములకు ముందుభాగములకు సంబంధము ముఖ్యమగు హుజూరు కచ్చేరీ జమీందారుగారు నివసించు భవనమునకుముందు నేబదిగజముల దూరములో నున్నది. హుజూరుకచ్చేరీ యొక మేడ. అచ్చట పురాతనములగు కాగితములగది, మేనేజరు దివానుగారి కచ్చేరి, హుజూరుఠాణేదారుగారి కచ్చేరి, గుమాస్తాల చావడి, ఖజానాకొట్టు, సిరస్తాదారుకచ్చేరి మొదలగునవి యున్నవి.

జమీహుజూరు కచ్చేరీకి సింహద్వార మిన్నీసుపేటలో నొక వీథి వైపున నున్నది. రాజాగారి మేడకు సింహద్వారము వేరొకవీథి నున్నది.

జమీందారుగారింట ఆశ్వయుజ శుక్ల పాడ్యమీ దినమున కలశ ప్రతిష్ఠాపన మొనర్చి దశరాత్రములు పూజలు, హరికథలు, సంగీతపుకచ్చేరీలు జరుపుదురు. జమీందారుగారు వీరేశలింగంపంతులు శిష్యుడగుటచే పూజాపురశ్చరణలపట్ల నుపేక్ష వహించియుందురు.

శ్రీరాజావిశ్వేశ్వరరావు (డిప్యూటీకలెక్టరు) గారు తోడల్లుని జూచుట తోడనే కొంచెము తల పైకెత్తి క్రిందిచూపు చూచి మామగారికి దనకన్న తోడల్లునిపై నెక్కుడు ప్రేమయున్నదని గ్రహించినాడు. అతని హృదయమున నుడుకుబోతుతనము ప్రవేశించినది. ఎంత ధనమున్నను, ఈ సామాన్య సంసారిబిడ్డపై మామగారి కేల యీ గౌరవమో తెలియదు.

ఆరోజున నారాయణరావుతో మామగారు వివిధవిషయములగూర్చి చర్చించుట జూచినాడు. నారాయణరావు చాల తెలివైనవాడనియు, నింత వరకు ప్రతిపరీక్షయు విశ్వవిద్యాలయమునకు మొదటివాడుగా నుత్తీర్ణుడైనా డనియు బెద్దయల్లునికి దెలియజేసినాడు జమీందారు.

తోడల్లుళ్ళిద్దరకు సంభాషణ జరిగింది. ‘ఏమండీ ఖైదుకు వెళ్ళివచ్చారే, మళ్ళీ కాలేజీలో ఎందుకు చేరారూ?’ అని విశ్వేశ్వరరావు ప్రశ్నించెను.

‘నేను చేసింది పొరపాటేనండి అన్నగారు. నేను మాతండ్రీ, ఇతర చుట్టాలూ ఎంతచెప్పినా వినక, యింటరులో నెగ్గిన సంవత్సరము వేసవి కాలంలో సహాయనిరాకరణంలో జేరాను. ఖైదుకు వెళ్ళాననుకోండి.’

‘రాజమండ్రి జైల్లోనే ఉన్నారా?’

‘రెండునెలలు రాజమండ్రీ, నాలుగునెలలు కడలూరు.’

‘అలాగా!’

‘అవునండి. జైలునుంచి వచ్చాను. జైలుకుముందు ఆరు నెల్లు దేశంఅంతా తిరిగి ఉపన్యాసాలు ఇవ్వడం, ఖద్దరమ్మడం మొదలైన ప్రచారం చేశా. ఆ తర్వాత జైలు. మొదట దిగేటప్పుడు పాశ్చాత్యవిద్య మానేసి ఏ సంస్కృతమైనా నేర్చుకుందా మనుకున్నాను, లేకపోతే ఏ గుజరాతీ విద్యాపీఠంలోనో