పుట:Narayana Rao Novel.djvu/169

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

168

నా రా య ణ రా వు


పుష్పశీలకు రాజేశ్వరునిపై నట్టి వెఱ్ఱి జనించినది. ఎట్లయినసరే తన కోర్కె తీర్చుకొనవలెను. ఆమెకు సతతము రాజేశ్వరుడే ప్రత్యక్షమగుచున్నాడు. రాజేశ్వరుని నవ్వులు, రాజేశ్వరుని వట్రువలుతిరిగిన ఛాతీదండలు మనోనేత్రమున దోచి యొడలు ఝల్లుమనుచుండెను.

నిముషముల నలంకరించుకొన్నది. మోము కడిగికొని సుగంధ మలది కొన్నది. సువాసనపొడిచే మొగము కైసేసినది. సన్నని చీరకట్టి, సన్నని రైక తొడిగి గదిలోనికి వెడలిపోయినది. తలుపు వేసికొన్నది.

రాజేశ్వరుడు నిముషమొక యుగముగా వేచియున్నాడు.

‘నీవు రావనుకొన్నాను. ఆనాడు మీ ముసలమ్మకు జబ్బు చేసినప్పుడు వస్తే సమయానికి నీ భర్త వచ్చాడు. ఈ రోజున ఏమి అడ్డమో అనుకున్నాను.’

‘మీరు పరపురుషులు. నేనిల్లా రాకూడదు. పొరపాటు. నే వెళ్ళిపోతా.’

‘అయితే, నన్నెందుకు రప్పించావు?’

‘ఎందుకో? ప్రతిరోజూ మాయింటికిరావడం, మాయింటిముందర యింటి అరుగుమీద మధ్యాహ్నము స్నేహితులతో మాట్లాడుతూ కూర్చుండడము, కారణం నాకు తెలియక ఏమిటో కనుక్కుందామని అనుకున్నాను.’

‘అల్లాగా’ అని రాజేశ్వరుడు డా బాలికను పొదిగిట నదుముకొన్నాడు. పెదవులపై ఫాలముపై ముద్దులిడినాడు. ఆ బాలిక తప్పించుకొని పారిపోయి రోజుచు, చిరునవ్వు నవ్వుచు, నురస్థలమెగుర మంచముపై పడిపోయినది. రాజేశ్వరుడు నవ్వుచు మంచముపై నా బాలిక నదిమిపట్టి మెడ ముద్దుకొన్నాడు.

కాలేజీ కేగుటకింక నాలస్యము చేసినచో జాల నష్టమువచ్చునని సహాధ్యాయు లిరువురు మువ్వురు వ్రాయుటతోడనే రాజేశ్వరుడు రాజమహేంద్రవరము నుండి కదలివచ్చుచు, తన్ను గిండీకి బోవుదారిలో గలియుమని నారాయణరావుకు తంతి నిచ్చినాడు. ఆ మాట పరమేశ్వరునకు దెలిపెను నారాయణరావు.

ఉదయమున మెయిలు వచ్చునప్పటికి తనకారుమీద నారాయణరావు సెంట్రల్ స్టేషన్ చేరునప్పటికి మెయిలుబండియు వచ్చినది.

సెలవులు పుచ్చుకొని స్వస్థలముల కేగుచున్న రెండు మూడు తమిళయ్యరు కుటుంబములు తప్ప తక్కినవారందరు తెలుగువారే. వర్తకమునకు, హైకోర్టు పనికి, యాత్రలకు, వైద్యములకు వచ్చువార లాబండి మూడవ తరగతుల నిండియుండిరి.

బండి యాగుటతోడనే వందలకొలది కూలీలు బండిలోనికిబోయి ‘వద్దు వద్దు’ అనుచుండగనే చేతిమూటలు లాగువారు, ‘సామాను దించినతర్వాత బేర