పుట:Narayana Rao Novel.djvu/168

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పు ష్ప శీ ల

167

‘నీకింత ప్రేముందా, పుష్పం?’

‘నా బ్రతుకంతా ప్రేమేనండీ!’

‘నువ్వు పుష్పంలా దివ్యమైన చరిత్రగలదానివిసుమా ప్రణయసుందరీ.’

‘మీ మిద కవిత్వం రాయాలి. ఇంతవరకూ అందరూ మగవాళ్లే కవులు. నేను మీమీద పాటలు పద్యాలు రాస్తాను. మారుపేరు పెట్టుకొంటాను. పత్రికకు పంపించనా?'

‘తప్పకుండా పంపించు. నువ్వు పంపించబోయేముందర నాకుచూపిస్తూ ఉండు. నాకు కవిత్వం రాదు. లేకపోతే నేనును నీమీద వందలకొలది పాటలు రాస్తూ ఉందును.’

‘ఓ సామి నిను జూసి
నాయెడద తీపినై
నిలువెల్ల ప్రవహిస్తు.
మంచుకొండై నువ్వు
మబ్బు బాలిక నేను,
నీపై ననవరతము
నృత్యాన సోలెదను’

‘ఈపాట బాగుందండీ?’

‘నువ్వు రాసిం దేదిబాగుండదు! నాకు ఏది మంచిదో ఏది చెడ్డదో తెలియదు. కాని, ఇప్పుడు భారతి మొదలైన పత్రికల్లో ప్రచురింపబడే భావకవిత్వంకన్న తక్కువగా ఉన్నదా యేమిటి!’

మరునాడు భర్త కోర్టుకు వెళ్ళినప్పుడు, తన్ననవరతము కాపాడుచుండు పనిమనిషి నెట్లయిన వదలించుకొనదలచి భర్తకొక యుత్తరము వ్రాసి పంపించినది. పనిమనిషి యా యుత్తరము పట్టుకొని జడ్జీకోర్టుకనిపోయినది. వీథిలోని బాలకునిచే రాజేశ్వరున కొక యుత్తర మంపినది. రాజేశ్వరుడువచ్చి దొడ్డి గుమ్మమున దొడ్డిలోనికి ప్రవేశించినాడు. వంటచేయు చుట్టపుమేనత్త ముసలమ్మ కేదియో వంకబెట్టి పని కల్పించినది. వసారా గుమ్మమున లోనికి రప్పించి రాజేశ్వరుని మేడమీద గదిలోనికి పంపినది. తల నొప్పిగా నున్న దనియు, కొంచెముసేపు గదిలోనికిబోయి పరుండెదననియు జెప్పి, మేడమీద గదిలోనికిబోయి తలుపు వేసికొన్నది.

కొందరు స్త్రీలు తమకోర్కెను దెలిపియు దెలుపని కటాక్షవీక్షణాదులచే దెలుపుచు, పురుషహృదయములు జూరగొని మనోభీష్టము తీర్చుకొందురు. కొందఱు తమ కోర్కెను భయముచే, లజ్జచే బ్రియునకు దెలియనీయక, అపరిమితమగు బలవంతముచేవలె బ్రియుని యాశ్లేషములో నణంగుదురు. తామై బయల్పడి, కోర్కె నెరింగించుకొని బ్రియునకు వశలగు వనిత లరుదు. అట్టి వారి ప్రేమము గట్లుతెంచుకొని పాఱుచుండ దాని నెవరడ్డగలరు?