పుట:Narayana Rao Novel.djvu/125

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

124

నారాయణరావు

నారా: అది నేను ఒప్పుకోనోయి.

ఆలం: నేనూను.

నారా: ఎందుకంటావా? అసలు వీళ్ళలో పూర్వం నుంచీ మనస్సులకు వినోదము కలిగించేవారు కొందరు, కొందరు దేశదిమ్మరిజాతులు, అడవిజాతులు. వారివల్ల భూతవైద్యం ఎరుక చెప్పించుకోవడం మొదలయిన లాభాలు పొందుతున్నాం మనం.

రాజా: అయితే ఆ భూతవైద్యం, ఎరుకచెప్పడం నీ కిప్పుడు నమ్మకమేనా?

నారా: నేను బిచ్చగాళ్ళ చరిత్ర చెప్పుతున్నానేగాని నాకు నమ్మకం అన్నానామరి. విను! వీళ్ళంతా మనకు ఏదో లాభం కలుగజేసి, మనవల్ల లాభము పొందేవాళ్లు. రానురాను మనకు పాశ్చాత్యనాగరికతవచ్చి ఈ బిచ్చగాళ్ళ జాతులలో ఉండే కళాసౌందర్యము అనుభవించడము రూపుమాసింది. జంగాలు పాడే బొబ్బిలిపాట, దేశింగురాజుకథ, సర్వాయిపాపడుకథ, బాలనాగమ్మకథ, మరాటీకథ, చెన్నప్ప రెడ్డికథ, కామమ్మకథ మనము వింటున్నామా? ఆ కథలలో చమత్కృతీ కళాధిక్యత గమనిస్తున్నామా? పాటక జనం మాత్రం నేటికీ ఆ కథలు విని ఒక అనిర్వచనీయానందం పొందుతూ, వారికి తోచిన బహుమతులు యిస్తున్నారు.

ఆలం: మా మతం ఎప్పుడూ ధర్మం చేయమంటుందిరా !

రాజా: అసలే మనదేశం బీదదేశం. ఇప్పటికైనా వీళ్ళు వదలక పోవడం ఏమిటని?

పరం: వాళ్లెలా వదలుతారోయి? వాళ్లకి ఆధారం యేదయినా చూపించూ. వాళ్లకీ వృత్తి మహాసౌఖ్యమా ఏమిటి? వాళ్ళపాట వినో, ఆట చూసో, మాటకు ఆనందించో ప్రతిఫలంక్రింద గుప్పెడు గింజలిస్తున్నాం. అంతేనా?

రాజా: అలా మనకు నువ్వు చెప్పే ప్రతిఫలం ఇవ్వకపోతే?

పరం: ప్రతిఫలం ఇవ్వకుండా ఉట్టి ముష్టి ఎత్తుకునేవాళ్లు చాలాతక్కువ కాదటోయి. వాళ్లయినా ప్రప్రథమంలో ఏదో ప్రతిఫలం యివ్వకుండా ఉండిఉండరు.

రాజా: నేను చెప్పేవిషయం యిద్దరూ గ్రహించలేదు.

నారా: ఉండరా పరమం! నువ్వనేది, రాజారావు! వాళ్ళిచ్చే ప్రతిఫలం ఇవ్వనిదానితో సమం. కాబట్టి బీదదేశమయిన మన దేశానికి వీళ్లు బరువు చేటు. కనుక యా ముష్టియెత్తడం మానిపించి వెయ్యాలని. అదేనా నీవాదన?

రాజా: అవును.

నారా: సరే, బిచ్చగాళ్ళకు నువ్విప్పుడేదైనా పని చూపిస్తావా?