పుట:Narayana Rao Novel.djvu/120

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాఢస్నేహము

119

నేకమై బయోకెమిస్ట్రీ విద్యలో ననేక నూతనపథములు కనుగొని నూతన విషయముల ప్రపంచమున కర్పించుచున్నాడు.

రామచంద్రరావుయొక్క యుత్కృష్టధీశక్తి గాంచి హార్వర్డువిశ్వవిద్యాలయ పండితోత్తము లాశ్చర్యపూరితులైనారు. గణిత శాస్త్రమున బ్రపంచ ప్రఖ్యాతిగాంచిన కమింగ్సు పండితుడు రామచంద్రుని మేధాసంపన్నతకు మెచ్చి, యాతని దనయండ జేర్చుకొని వేయికనులతో గాపాడుచుండెను.

౫(5)

గాఢస్నేహము

నారాయణరావు మదరాసులో బి.ఎల్. తరగతిలో జేరినాడు. టెన్నిసు, కాలిబంతి, క్రికెట్టు ఆటలలో నాతడు మొనగాడు. న్యాయకళాశాలలో నాంధ్ర విద్యార్థులందరు నారాయణరావును విద్యార్థి సంఘ కార్యదర్శిగా నెన్నుకొని ధన్యులైనారు. పరమేశ్వరుని తనకడ కొన్ని నాళ్లుండు మని నారాయణ కోరుటచే నా యువకుడును వచ్చి చెన్నపట్టణములో నాతని చెంతనే నివసించెను. ఆలం నారాయణుని వదలడు.

పరమేశ్వరునకు చిత్రవిద్యా సంబంధమగు ఉద్యోగమేదైన దొరకు వరకు, విశ్వదాత యగు నాగేశ్వరరాయలు ఆంధ్రపత్రికా కార్యాలయమున నాతనికి బ్రవేశము ప్రసాదించిరి. కావున ‘భారతి’కి కథలను బద్యములను వ్రాసి యిచ్చుచు, దినమునకు రెండుగంటలు చిత్రవిద్యాపరిశ్రమము సల్పుమని నారాయణరావు బోధించెను. తానును బరమేశ్వరునకు వేవిధంబుల సహాయము చేయుచుండెదనని నెమ్మదిగా దెలిపినాడు. నారాయణుడు తీరికయైన వేళలందు పరమేశ్వరునితోగలసి, మహదానందరూపములై అద్భుత లేఖనా మూర్తిమంతములగు చిత్రములు చిత్రించువాడు. పరమేశ్వరు డాంధ్రపత్రికా కార్యాలయమున బ్రవేశించినాడు.

పరమేశ్వరున కయిదుగు రన్నదమ్ములు. పరమేశ్వరమూర్తి తండ్రియగు వెంకటరమణమూర్తిగారు మునసబీ చేసి యుపకారవేతనము (ఫించను) బుచ్చుకొన్నారు. బహుకుటుంబి యగుటచే నాయన ధనమేమిము వెనుక వైచుకొన లేదు. కుమార్తె వివాహమున కాఱువేలు ఖర్చుచేసినాడు. లంచములమాట వినబడినచో నగ్నివలె మండిపోవువాడు. నేడు ప్రభుత్వమువారిచ్చు వేతనము తప్ప నాయన కితరాధారము లేదు. ఆరుగురు కుమారులకు జదువులు చెప్పించెను. నెలకువచ్చు మూడువందల రూపాయలు తిండికి, కడగొట్టు బాలుర చదువులకు, వృద్ధురాలగు తల్లి వైద్యమున కాయనకు బప్పువలె ఖర్చయి పోవును. పెద్దకొడుకులు ముగ్గు రుద్యోగములలో నున్నను వారు తెచ్చు జీతములు వారి కుటుంబములకే సరిపోవును, అప్పుచేయుట యన్నచో