కావ్యాలంకారసంగ్రహ మనునామాంతరమున నలరు నీ నరసభూపాలీయ మనునలంకారగ్రంథమును దెలుఁగున రచియించిన మూర్తికవి లక్షణకవులలో నొకఁడు. విద్యానాథుఁడు సంస్కృతమున వ్రాసిన ప్రతాపరుద్రీయ మనునలంకారశాస్త్రము నీతఁడు పద్యకావ్యముగా వ్రాసెను. విద్యానాథుఁడు కృతిపతినామధేయాంకితముగ లక్ష్యభాగమును వ్రాసినట్లే యీభట్టుమూర్తియుఁ గృతిపతి యగునరసభూపాలునిపేరట లక్ష్యభాగమును వ్రాసియున్నాడు. సంస్కృతమున విద్యానాథునికవిత్వ మెంతశ్లాఘాపాత్రమో ఆంధ్రమున నీతనికవిత్వము నంత శ్లాఘింపఁదగిన దని చెప్పుట కావంతయు సందియము లేదు. వసుచరిత్రము లోనగు గ్రంథములు వ్రాసిన రామరాజభూషణుఁ డే యీమూర్తికవి యని కొందఱును, కాదని కొందఱును వాదింతురు. నిష్పక్షపాతబుద్ధితోఁ బరిశీలింప వీరిరువురకవిత్వ మేకరీతిగనే యున్నదని తోఁచెడిని. వీరిచరిత్రవిషయ మిచ్చట పెంచి వ్రాయఁబూనుకొనము. అవిషయమును నిర్ణయించుగ్రంథములు వేఱు మాపని యది గాదు. గ్రంథమును గూర్చి మాత్రము వ్రాయుపని మాదై యున్నది. ఇప్పనిని జేయఁబూని శాఖాచంక్రమణముగాఁ గవికాలము మొదలగువానిని నిర్ణ యింపఁబోవుట “నీవీబంధనవేళాయాం వస్త్రమూల్యపరీక్షణమ్” అనున్యాయము ననుసరించినట్లె యగును. కాబట్టి చరిత్రగ్రంథకర్తల కాభాగమును వదలితిమి.
ఇమ్మహాకవి కవిత్వ మసమానమై, యమృతముఁ బోలి కవివిబుధజీవనాధారమై, హృదయంగమమై చెన్నారుచున్నది. నిఘంటువులఁ జెంత నునిచికొని యొక్కొక్కపదమునే యేర్చికూర్చినకవిత్వమువలెఁ గాక యీతని కవితాధార దివిజగంగాప్రవాహముం బోలి యనివార్యవిజృంభణము గలదియై పెం పొందుచున్నది.
భారత భాగవత రామాయణాదులు చరిత్రముతో సంబంధించిన గ్రంథములు. అట్టి గ్రంథములయందుఁ గవి పలుపోకలం బోవచ్చును. ఈ గ్రంథ మట్టిది కాదు. అలంకారశాస్త్రము గావున స్వేచ్ఛగా స్వకపోలకల్పనలఁ జేర్చుట కవకాశ మీయదు. అట్లయ్యును గ్రంథమును రసవంతముగను, మృదుపదసంఘటితముగను జెప్పి తనకవితామహిమను జూపియున్నాఁడు. కవియే తనకవితామహిమను గూర్చి యిట్లు వ్రాసికొనియున్నాడు.
| సీ. | బాణు వేగంబును, భవభూతి సుకుమార,తయు, మాఘు శైత్యంబు, దండి సమత, | |