నాయకురాలు
41
నల : పల్నాడు యింకను పూర్తిగా మానవుడికి స్వాధీన పడ్డట్టు లేదు.
నర : ఇప్పుడుసహా, వృక్షసృష్టీ, జంతుసృష్టీ, మనుష్యసృష్టీ మూడూ స్వాధికారానికై ఒకదానితో వొకటి పల్నాటిలో పోరుతునే వున్నవి.
కే : మనుష్యుని గొడ్డలి ఎప్పుడూ వూళ్ల చుట్టూ ఆడుతూ వుండవలసిందే. కాస్త ఏమార్లితే వూళ్లు అడవి వేసిపోతవి.
నల : ఇప్పు డెంత ప్రొద్దయింది ?
కే : కిరణములు నిలువుగా పడుతున్నవి. రెండుజాములు కావచ్చింది.
నర : చండకిరణుడు తన యెండను గోల్పోయి చంద్రమండలము ననుకరించుతున్నాడు.
కే : కిరణములు వేడిమినిమాత్రమేకాక తెల్లదనమునూ గోల్పోయి పందిటికి గట్టిన పచ్చతీగలవలె వ్రేలాడుతున్నవి.
నల : ఆవరణముయొక్క ప్రభావంచేత యిచ్చట సర్వమూ వనసామ్యమును పొందుతున్నది.
ఎవ రా యౌవనుడు? వేట కరుదెంచిన వసంతకుమారునివలె వున్నాడు.
కే : యౌవనము మూర్తీభవించినట్లున్నది. గాండీవము ధరించిన అర్జునకుమారుడా యేమి ?
నర : ఇట్టి పురుషసౌందర్యమును నే నెన్నడూ చూడ లేదు.
నల: ఆ యౌవనమునకు యీ వనసౌందర్య మెంతో పొందిక గా వున్నది.