పుట:Naajeevitayatrat021599mbp.pdf/914

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

894

నా జీవిత యాత్ర-4

చేర్పించవలసిందని ప్రకాశంగారు ప్రతిపాదించారు.....

"ఆయన జ్ఞానం, అనుభవం నన్ను ఉత్తేజపరిచినవి. ప్రజారంగ మందు ప్రవేశించి, ఆయనతోబాటు పని చేయగలిగిన లాభం నాకు సమకూరింది. ఆయనా, నేనుకూడా మహాత్మా గాంధీగారి నిర్మాణ కార్యక్రమంలో ఉత్సాహం కలిగిన వారమే.

హరిజనాభ్యుదయం చర్ఖా పరిశ్రమను విస్తరణ, ఉత్పత్తి వినియోగదారీ సంఘోద్యమం, ఫిర్కా అభ్యుదయ ఉద్యమములు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా స్థాపించబడ్డాయి.

"ప్రకాశంగారికి దూరదృష్టి హెచ్చుగా ఉండేది. కొన్ని సంవత్సరాల ముందుగా భవిష్యత్ కార్యక్రమం సాధించవలసిన లక్ష్యాలు ఆయన గ్రహించ గలిగేవారు.

"మన నాయకులలో పెద్దవారికి ఆ దూరదృష్టి ఉండేది కాదు."

రాష్ట్రపతి చెప్పిన మాటలు ముమ్మాటికీ సత్యం.

నవ్యాంధ్ర జనకుడు

భారత ప్రధాని ఇందిరాగాంధీగారు -

"స్వాతంత్ర్య జ్యోతిని సాహసంతో వెలిగించిన దేశ భక్తాగ్రశ్రేణికి చెందినవారు ప్రకాశంగారు. ముందు వెనుకలు చూడని ధైర్యము, దాతృత్వములవల్ల ఆయన ఒక పురాణ పురుషులయ్యారు. ఆయన ప్రవర్తనవల్ల వందలాది అనుయాయులు, దేశ స్వాతంత్ర్యంకొరకు త్యాగాలు చేశారు. నవ్య ఆంధ్రప్రదేశ జనకుడు ఆయన. భారత జాతీయోద్యమ నాయకుల శ్రేణిలో అగ్రశ్రేణికి చెందిన నాయకుడు" అని ఆ సందర్భంలో ఆమె వ్రాశారు.

నేను ఇంతవరకు చెప్పడానికి యత్నించిన బహుళ గ్రంథమును, ఆమె సంక్షిప్త సూత్రంగా చెప్పారు.

ప్రకాశంగారు ఆంధ్రప్రాంతాలలో పుట్టిన భారత జాతిరత్నం.

సత్యమేవజయతే