విభజనల్లో, పుస్తకాలు ఒకరి చేతిలోనుంచి మరొకరు లాగుకోవడాలు కూడా జరగవలసి వచ్చిందట.
ఏదోవిధంగా విభజన కార్యక్రమం చురుకుగానే నడిచింది. మనము కోరినట్లు కేంద్రప్రభుత్వం సుబ్బారావుగారిని స్పెషల్ ఆఫీసరుగా నియమించింది. నేను అంతకుముందుగానే గుంటూరుకు పోయి, అక్కడి కలెక్టరు ఆఫీసు వేరే భవనంలోకి తరలించి, కలెక్టరు ఆఫీసులో కావలసిన మార్పులు, చేర్పులు చేయడానికి బిల్డింగ్స్ చీఫ్ ఇంజనీరును నియమించడం జరిగింది. భవనంలో చేసే ఏర్పాటులు, కట్టడములు, ఏయే గదులు ఏయే పనులకోసం కేటాయించవలసింది మొదలైన విషయాలలో స్పెషల్ ఆఫీసరుగారి ఆదేశాల ప్రకారం నడుచుకోవలసిందని చీఫ్ ఇంజనీరుగారిని ప్రభుత్వం ఆదేశించింది.
ఇది ఇలా ఉంటుండగా, తెరవెనక మరొక ముచ్చట జరిగింది. అప్పటికి అమలులో ఉన్న కేంద్రప్రభుత్వ హోమ్శాఖ ఆదేశాన్ని అనుసరించి - ఆంధ్రప్రభుత్వం సుబ్బారావుగారిని ప్రధాన న్యాయమూర్తిగా నియుక్తం చేయవలసిందనీ, మరో ఇద్దరి జడ్జీల పేర్లతో సహా, గవర్నరు సలహాతోబాటు కేంద్రప్రభుత్వానికి పంపింది.
ఇక్కడనుంచి, ఈ వ్యవహారంగురించి నేను వ్రాయబోయేది - హైకోర్టు సంస్థాపన తర్వాత, రాష్ట్రపతి రాజన్బాబుగారిని కలుసుకొన్నప్పుడు, వారు చెప్పిన విషయాలను బట్టి వ్రాస్తున్నాను.
సుప్రీంకోర్టు ముఖ్య న్యాయాధిపతికి వేరే భావాలు ఉండడంచేత కాబోలు, ఆయన రాష్ట్రపతికి ఈ విషయమై సిఫారసు చేయలేదు. అదివరలో అటువంటి ఆలస్యాలు జరుగలేదు.
హోం మంత్రి కట్జూగారిని కనుక్కుందామంటే, ఆయన ఢిల్లీ వదిలి, ఒరిస్సాలో పర్యటించడానికి వెళ్ళారు. ఆయన అక్కడినుంచి అటే 5-7-54 న గుంటూరుకు వచ్చేటట్టు తీర్మానింపబడడంచేత ఆయనను కనుక్కునే అవకాశమే లేకపోయింది.
సుప్రీంకోర్టు రిజిస్ట్రారును అడిగితే, ముఖ్య న్యాయమూర్తి