న్కు అధ్యక్షులయిన నెహ్రూగారు కృష్ణమాచారిగారిని దాని ఉపాధ్యక్షులుగా నియమించారు.
కృష్ణమాచారిగారికి ఆంధ్రదేశానికి కొంత పూర్వపరిచయముంది. ఆయన విశాఖపట్నం జిల్లాలో విజయనగరం జమీందారీకి, డిప్యూటి కలెక్టరు హోదాలో ఉండగానే ట్రస్టీదివానుగా పనిచేశారు. కాబట్టి, విజయవాడ ఆనకట్ట మనదేశంలో వరిపంట కెంత ముఖ్యమైనదో తెలియనివారు కారు. అక్కడ జరిగిన దుస్సంఘటన సంగతీ తెలియనివారూ కారు. ప్రతిక్షణం జాగరణలో ప్రజలూ, ప్రభుత్వమూ ఆనకట్ట ఇంకేమి ప్రమాదానికి గురిఅవుతుందో అని గుండెలు చేత పట్టుకొని ఉన్న విషయమూ ఎరుగనివారు కారు.
ఇన్నీ తెలిసిన ఆయన - నేను వెళ్ళగానే కూచోబెట్టి, కాఫీ యిచ్చి, నేను చెప్పిన మాటలన్నీ యోగీంద్రునిలాగా తూష్ణీభావంతో విని, "వీటన్నిటికీ డబ్బు ఎక్కడ ఉంది?" అని ప్రశ్నించారు.
నేను మరికొంతసేపు వాదించిన పిదప, "కరువు ప్రాంతాలకు కేటాయించిన మొత్తంతో ఆ బారేజ్కు అవసరమైన ఖర్చు పెట్టుకోండి. నేను అభ్యంతరం పెట్టను," అన్నారు.
ఇంతకు మేము అడిగింది అప్పు.
ఉమ్మడి రాష్ట్రంలో ఉండిఉండగా, పని చురుకుగా జరిగితే, ఉమ్మడి రాష్ట్రపు డబ్బే దీనికి ఖర్చు అయిఉండును.
మనము ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న నాటికి, కృష్ణా అనకట్ట - దానిపై పెట్టిన ఖర్చులు, వడ్డీలు అన్నీ పోగా 12 కోట్ల రూపాయల రాబడికి చేకూర్చిన స్కీము.
రాష్ట్ర విభజన అప్పుడు, దీనికైన 2 కోట్ల, 20 లక్షల రూపాయలు ఆంధ్రరాష్ట్రం తీర్చుకోవలసిన అప్పుల పట్టీలో చేర్చారు. కానీ - ఖర్చులు, వడ్డీలు పోను వచ్చిన రాబడిని మనకు జమ చేయలేదు.
కృష్ణమాచారిగారు చెప్పిన విషయం ప్రకాశంగారికి చెప్పగానే ఆయన - దేశావసరములదృష్ట్యా, అసలు అనకట్ట పరిస్థితి దృష్ట్యా, ఒక క్షణం కూడా ఆలస్యం చేయడానికి వీలులేదనీ, కేంద్రప్రభుత్వం