పుట:Naajeevitayatrat021599mbp.pdf/832

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాష్ట్రమేమో క్రొత్తది, రాష్ట్ర విభజనలో అప్పుల పంపకమే అయింది. ధనరూపకమైన ఆస్తి నిల్వ లేవీ లేవు. అయినా, రాజ లాంచనాలతో, ఆ సమయానికి తగినట్టుగా, ఆ స్థలానికి వీలైనట్టుగా ఉపరాష్ట్రపతిగారికి, భారత ప్రధానిగారికి - గవర్నరుగారు, ప్రకాశంగారు, సంజీవరెడ్డిగారు అతిథి మర్యాదలు నడిపించారు.

ప్రకాశంగారు, ఆ తెల్లవారుజామున నా కొక ఉత్తరం వ్రాసి పంపించారు.

"నేను ఏర్పాటు చేయబోయే మంత్రి మండలిలో నిన్నొక మంత్రిగా తీసుకుంటున్నాను. అనుమతి పంపించవలసింది," అని ఉన్నది అందులో.

మాటల్లో ఈ విషయం అంతకు ముందు అనుకోకపోయినా, ఉప సంఘంలో నన్ను సభ్యునిగా వేసినపుడే ఇటువంటి ఏర్పాటు కాగలదని మే మనుకొన్న విషయమే. గౌతు లచ్చన్నగారు ఒప్పుకోక పోవడంవల్ల ఆ రోజున మంత్రిమండలిలో ఆయన పేరు గవర్నరు గారికి, ప్రకాశంగారు ఇవ్వలేకపోయారు.

నెహ్రూగారికి, ప్రకాశంగారు తమ పేరు, సంజీవరెడ్డిగారి పేరు, నాపేరు చూపి, త్వరలో మరొక నలుగురు మంత్రులను వేసుకొంటామని చెప్పారు.

ప్రకాశంగారు నా పేరు ఇచ్చినప్పుడు, నెహ్రూగారు "విశ్వనాథాన్ని కాంగ్రెసులో చేరమని మీరు అడగ కూడదా?" అన్నారట. అందుకు ప్రకాశంగారు "నేను అతనిని చేరమని అడగను. అతను చేరనూ చేరడు. ఈ విషయము మనము అలాగే ఉంచేయవలసిందే," అన్నారట. ఈ విషయము నాకు రాధాకృష్ణగారు చెప్పారు.

శాసన సభలో మాకున్న మెజారిటీ మొదట్లో బాగా ఉందనుకున్నా - మాలో ఉన్న కొందరు, తమలో ఉన్న ఒకరికి మంత్రి పదవి ఇవ్వలేదన్న కారణం మనసులో ఉంచుకొని, ఆదర్శ భేదాలు నెపంగా చెప్పి, ప్రతిపక్షంలో కలిసిన తర్వాత, ప్రభుత్వానికి సంఖ్యాబలం తగ్గింది.