పుట:Naajeevitayatrat021599mbp.pdf/696

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పాకలలో పెట్టారు. మర్నాడు లేచిన తర్వాత ఉన్నంత చోటులోనూ ఎలాగో సర్దుకున్నాము.

ఈ జైలుకు రాక పూర్వం, వేలూరు జైలులో ఉండగానే - కళా వెంకటరావు, నీలం సంజీవ రెడ్డి, ఎం. పళ్ళంరాజు, ఎం. బాపినీడు మొదలైనవారు ఒక కట్టుగా ఉండి, ప్రకాశం గారికి ఏవైనా సౌకర్యాలు కలుగజేయాలనే విషయంపై ఎటువంటి ఆసక్తి చూపక పోవడమే కాకుండా, ఆయన ఏ సెల్లులో ఉంటానంటే, అది ఆయనకు ఇవ్వకుండా చేయడానికి కూడా ప్రయత్నించే వారు. అదే ద్వేషభావాన్ని వారు అమరావతి జైలుకు కూడా తమతోబాటు తీసుకువచ్చారు. గిరిగారు మాత్రం ఎలాగో జైలు ఉద్యోగస్థులతో మాట్లాడి, ప్రకాశంగారికి ఒక మూలగా, ఇతరుల బాధ లేనిచోట చోటు ఇప్పించారు. ప్రకాశంగారు వేలూరులోను, అమరావతిలోను కూడా తాను తెచ్చుకున్న మట్టి పాత్రలలో స్వయంగానే వండుకునేవారు. ఆయన ఇతరులతో సాంగత్యం అట్టే పెట్టుకోలేదు.

'ఆంధ్రా సర్క్యులర్‌'

ఇలా ఉంటూండగా, గాంధీజీ 'క్విట్ ఇండియా' ఉద్యమం పేరున బ్రహ్మాండమైన శాబటేజ్ ఉద్యమాన్ని నడిపిస్తున్నారని, దానికి తార్కాణంగా "ఆంధ్రా సర్క్యులర్‌" అనేదానిని - మిగిలిన విషయాలు చాలా చేర్చి ఒక నేరారోపణ గ్రంథంగా అచ్చువేసి, మా అందరికి ప్రత్యేకమైన చార్జి షీట్లను పంపారు. ఇందులోని 'ఆంధ్ర సర్క్యులర్‌' అన్నది ఇదివరలో కళా వెంకటరావు నాకు బెజవాడ ప్లాట్‌ఫారం మీద చూపించిన కార్యక్రమమే అయిఉండెను. అయితే, అది ఆంధ్రా ప్రొవిన్షియల్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ యొక్క ఉత్తర శీర్షిక ఉన్న కాగితం (Letter - head) పైన రోనియోటైపు చేయబడి ఉండెను. అందుచేత, దానిని ఏ కాంగ్రెసు కమిటీ ఆదరించక పోయినా, ఆల్ ఇండియా వర్కింగ్ కమిటీ ముందు దాని ప్రసక్తే రాకపోయినా, దానికి 'ఆంధ్రా సర్క్యులర్‌' అనే ప్రఖ్యాతి మాత్రం వచ్చింది.

మా అందరికీ ఛార్జిషీట్లు వచ్చిన తర్వాత, ఎవరి యత్నంవల్లనో