పుట:Naajeevitayatrat021599mbp.pdf/670

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఏ ఆర్భాటమూ లేకుండానే వెళ్ళారు. మేము కొద్దిమందిమే మిగిలి ఉన్నాము.

వర్షాకాలం అంతమై, చెట్లకూ మైదానానికీ ఒక కొత్త పచ్చదనం వచ్చి కంటికీ, మనసుకూ ఆహ్లాదం కలుగుతూండేది. దాదాపు రెండు వందల మంది ఉండిన స్థలంలో మేము ముప్పై, నలభై మందిమి మాత్రం మిగిలేసరికి ఆ స్థల వైశాల్యం చూస్తే ప్రపంచమంతా అకస్మాత్తుగా విశాలత్వం పొందినట్టనిపించింది. నిత్యవాదోపవాద శబ్ద వైఖరి తగ్గడంచేత, మనసులో కొంత శాంతి కూడా సమకూరినట్లయింది. అయితే, ఈ శాంత స్థితి అకస్మాత్తుగా ఒక రోజున వ్యత్యస్తమయింది. అందుకు కారణం పత్రికలలోవచ్చిన ఒక వార్త. రాజాజీ ఏదో కాన్వొకేషన్ (స్నాతక) ఉపన్యాసంలో - హిందూ ముస్లిం సమస్యను ఐదు నిమిషాల్లో పరిష్కరించ వచ్చనీ, అందుకు జిన్నా కోరినట్లు పాకిస్తాన్‌ను భారత దేశం నుంచి విడదీయడమే మార్గమనీ పేర్కొన్నట్టు ఆ వార్త సారాంశము. నిశ్చలమైన జలాశయంలో పెద్ద ఎత్తునుంచి బండరాయి పడవేస్తే ఏ విధంగా అది అల్లకల్లోలమవుతుందో, ఆ విధంగానే జైళ్ళలో ఉన్న మా మనసులనే శాంత జలాశయంలో రాజాజీ చెప్పిన పరిష్కారం బండరాయిలా పడి, అశాంతిని రేపింది. ఇరవై సంవత్సరాలకు పైగా గాంధీగారు చేసిన హిందూ ముస్లిం ఐక్యమన్న ప్రచారానికి ఫలం ఇదేనా? తన మార్గానికి వ్యతిరేకంగా, భారత దేశాన్ని బద్దలుకొట్టే ఉద్దేశం ఉన్నవారిని గాంధీగారు ఏలాగు తమ ప్రత్యేక శిష్యులుగా భావించుకుంటున్నారు? అని పరిపరి విధాలైన మనోవేదనా తరంగాలు అందరి హృదయ సరసులందును ఉప్పొంగ సాగాయి. ఏమైనా సరే, జైలులోంచి వెంటనే ఎలాగో విడుదలయి రాజాజీని ప్రతిఘటించాలన్న భావోద్రేకం కలిగింది. అంతటిలో రాజాజీ భావాలను ప్రకాశంగారు బహిరంగంగా ఖండించినట్టు పత్రికలలో వార్తలు పడేసరికి కొంత ఉపశాంతి కలిగింది.

ఇంతేకాక, ప్రకాశంగారి అధ్యక్షతను విశాఖపట్నంలో డిసెం