పుట:Naajeevitayatrat021599mbp.pdf/539

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జవహర్‌లాల్ నెహ్రూగారినీ, ఇతర ముఖ్య నాయకులనూ, గాంధీగారి అరెస్టుతో పాటే, ఏవేవో కారణాలు చెప్పి, అరెస్టుచేసి జెయిళ్ళకు పంపించారు.

రౌండ్ టేబిల్ నాటకం

భారత రాజ్యాంగ కార్యదర్శి (సెక్రటరీ ఆఫ్ స్టేట్), బ్రిటిష్ ప్రభుత్వంవారూ నిన్న మొన్ననే గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ ధర్మమా అని ఒక మంట చల్లారిందనీ, అల్లా చల్లారిన మంట ధర్మమా అనే గాంధీగారిని దేశానికి ఏకైక నాయకుడుగా రౌండ్ టేబిల్ కాన్ఫరెన్స్‌కు పంపగలిగాం అని గ్రహించగలిగిన కారణంగానే, మళ్ళీ ఇంతట్లోనే ఇంకో పెద్ద మంట అంటుకుని, అది గబగబా అన్ని ప్రాంతాలకూ ప్రాకుతుందేమో అన్న భీతివల్ల పుట్టిన దడతో ఒకేసారిగా అన్ని ప్రాంతాలలోని అగ్రనాయకుల్ని ఏదో ఒక సాకుతో గబగబా అరెస్టుచేసేసి నిర్బంధంలోకి తీసుకుని, కటకటాల వెనక్కి పంపించి హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.

ఒక మహోన్నతమయిన అహింసాత్మక సమరం గాంధీ - ఇర్విన్ ఒప్పందం ధర్మమా అని ఆగిన సంగతి గ్రహించిన ఆంగ్లేయులు భారతదేశంపట్ల ప్రవర్తించిన తీరు ఇది! లార్డ్ ఇర్విన్ బ్రిటిష్ వారి ప్రతినిధిగానూ, గాంధీగారు భారతదేశపు ఏకైక నాయకుడుగానూ ఆ ఒప్పందంపై సంతకాలు చేసినా, బ్రిటిష్ కాబినెట్‌వారికిగాని, సెక్రటరీ ఆఫ్ స్టేట్‌కిగాని ఆ సంధి షరతులను మన్నించాలనీ, వాటిని అమలు పరచాలనీ ఏ కోశానా అభిప్రాయం ఉన్నట్లు కనబడలేదు. అమలుపరచకుండా ఉండడానికి కారణం చూపాలిగా! అలాంటి కారణంగానే ఈ రౌండ్ టేబిల్ కాన్ఫరెన్స్ పుట్టింది.

దేశాన్నీ, దేశీయుల్నీ, నాయకుల్నీ, కాంగ్రెసువారినీ అందర్నీ చల్లచల్లగా నేర్పుతో ఒక వల పన్ని లాగారు. ఆ రౌండ్ టేబిల్ కాన్ఫరెన్స్‌లో గాంధీగారిని సరిగా చూడలేదు సరికదా, ఆయన్ని అవమాన పరచడానికీ, చిన్నబుచ్చడానికీ ప్రయత్నించారు.