చేయవలసిన మర్యాద చేయ జాలనందుకు చింతిస్తున్నా"నని చెప్పాను. "ముందు ముందు కాస్త హెచ్చరిక జేసి మరీ దయచేయం"డని కోరాను.
ఆయన ఏ మనుకున్నాడో యేమోగాని, కాస్త తమాయించుకుని క్షమార్పణ చెప్పుకుని, మెల్లిగా గదినుంచి బయటికి నడిచాడు. నాకు ఇవ్వబడిన గది ఆస్పత్రి మెయిన్ వార్డులోని జాగా కాదు. అది నా కోసం, నేను నా మానాన - ఒక నర్సుయొక్కగాని, ఏ యితర నౌఖరుయొక్కగాని సహాయం లేకుండా - ఉండడానికిగాను ప్రత్యేకించబడిన గది.
పైకి ఎంత గంభీరంగానూ, క్రూరంగానూ కనబడ్డా మిస్టర్ హో మాత్రం సరళహృదయం కలవాడనే నా నమ్మిక. నాకు స్వస్థత చేకూరాక, నన్ను జెయిలులోకి మార్చారు. దుమ్ము, ధూళీతో నిండి, ఏదో మూలగానున్న ఒక గదిని నా కిచ్చారు. నా గదిని చేరి బాత్రూం లేదు సరికదా, ఆఖరికి ఒక 'కరోడ్' అయినా లేదు. ఇచ్చే ఆహారం చాలా పాడుగా ఉంది. మాకు కావలసిన ఆహారం మేము కొనుక్కోడానికి, ఇతర విధంగానూ ఆహార అవసరాలు తీర్చుకోవడానికి గాని అవకాశం లభించలేదు. అల్లా ఆ గుహలో రెండు, మూడు వారాలపాటు ఉన్నాను. మమ్మల్ని సాయంత్రం 6 గంటలకు లాకప్పులో పెట్టి, ఉదయం 6 గంటలకు బయటకు రానిచ్చేవారు. అల్లా జెయిల్లో అయిదారు వారా లున్నాక, నన్ను తిరుచిరాపల్లి జెయిలుకు మార్చారు.
తిరుచీ జెయిలుకి సత్యాగ్రహుల వెల్లి
తిరుచిరాపల్లి జెయిలుకు నేను వెళ్ళేసరికి అక్కడి పెద్ద జెయిలుకు అంటి ఉన్న 'క్వారెంటైన్' (Quarantine)లో, చెన్న రాష్ట్రీయులే గాక, హిందూదేశపు పలుతావులనుంచి అక్కడికి పంపబడిన అనేక సత్యాగ్రహులు నాకు తారస పడ్డారు. ఐర్లెండ్ దేశానికి చెందిన మిస్టర్ కార్నిష్ (Mr. Cornish) అప్పట్లో అక్కడి జెయిలు సూపరెంటెండెంట్గా ఉండేవాడు.
అక్కడ వార్డర్లు మామూలు ఖైదీలను వారి ఇష్టం వచ్చినట్లు