పుట:Naajeevitayatrat021599mbp.pdf/491

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మందికి ప్రాణదానం చేయగలిగాడన్న సంగతి లోగడ వివరించే ఉన్నాను.

పరిపాలకులు మాత్రం నన్నూ, నాగేశ్వరరావు పంతులుగారినీ అరెస్టు చేసిందాకా ఇతరుల జోలికి పోలేదు. నన్ను జైలులోకి నెట్టే వరకూ కాల్పులూ జరపలేదు.

క్రమంగా ఇళ్లల్లోనే ఉప్పు పంట

అల్లా అనుదినమూ సత్యాగ్రహులు ఎన్నో వీథులమ్మట ఊరేగుతూ ఉంటే, వింత చూడడానికి వచ్చిన వేలాది జనులతో వీథులన్నీ కిటకిటలాడిపోయేవి. ఆ ప్రకారం క్రొత్తదారులు పట్టిపోతూ అన్ని ముఖ్యమయిన పురవీథులనూ కాలినడకన గాలించేశాం. హిందూదేశం మొత్తం మీద మదరాసు సువిశాలమూ, సుదీర్ఘమూ అయిన పట్నం. ఆ పదిహేను రోజులలోనూ మేము చూడని వీథిగాని, త్రొక్కని సందుగాని లేదు. ఆ ప్రకారంగా సముద్రతీరాన్ని చేరుకుంటూ, పదిమైళ్ళ పొడుగున్న ఆ తీరపు అన్ని ప్రాంతాలలోనూ ఉప్పు తయారుచేశాం. వేలాది జనం తమ సొంత కుండలతోనూ, వంటచెరకుతోనూ వచ్చి, మాతోపాటు ఆ యా ప్రాంతాలలో ఉప్పును తయారుచేసేవారు.

ఎందరో మిల్లు పనివారు కూడా మాతోపాటు ఉప్పు తయారీలో పాల్గొన్నారు. ఒక రోజున చూళై మిల్లు ప్రాంతంలో, మేము ఉప్పు వండడానికి బయల్దేరిన తరుణంలో, మా వెనుకనే వేలాది మిల్లు పనివారు వారి వారి కుండలతో ఉప్పు తయారుచేయడానికి సిద్ధమయ్యారు. వారిని పారీస్ కార్నర్ ప్రాంతంలో, పోలీసువారు అటకాయించడమూ, కొంత చికాకు గలుగచేయడమూ సంభవించింది. ఆ రోజున కొంత హింసాకాండ జరుగుతుందేమోననీ, ఆ హింసాకాండ కారణంగా మా కార్యక్రమం దెబ్బతినవచ్చుననీ తలిచాం. కాని ఆ నాడు ఏమీ జరుగలేదు.

నా భార్యకూడా అప్పుడప్పుడు నాతోపాటు ఈ ఊరేగింపులలో పాల్గొనేది.