పుట:Naajeevitayatrat021599mbp.pdf/444

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కలకత్తాలో కార్మిక ప్రదర్శనం

1928 లో కలకత్తాలో కాంగ్రెస్ జరుగుతూండగా కార్మికులచే బ్రహ్మాండమయిన ప్రదర్శనం జరిగింది. అ ప్రదర్శనం కలకత్తా నగరంలోనూ, కాంగ్రెస్ పెండాల్‌లోనూ కూడా జరిగింది. సుభాస్‌చంద్రబోసూ, జవహర్‌లాల్ నెహ్రూగారలు ముందు నడువగా, కార్మిక వర్గనాయకులూ, కార్మికులూ, కలకత్తా పురవీధులగుండా ఊరేగుతూ కాంగ్రెస్ పెండాల్‌కు చేరుకున్నారు. ఆ బ్రహ్మాండమైన ఊరేగింపు మనస్సును కదిలించి, కరీగించేదిగా ఉంది. నేను కొంచెం జోరుగా నడిచి ముందుకు చొచ్చుకుని వెళ్ళేసరికి - జవహర్‌లాల్‌నెహ్రూ ఒక బస్సు ఇంజన్‌మీదా, సుభాస్‌బోసు ఇంకో బస్సు ఇంజన్‌మీదా కాళ్ళు ఇటూ అటూ వేసుకుని గుర్రాలమీద స్వారీ చేస్తున్న పద్ధతిగా ఆసీనులయి ఉన్నారు. ఆ ప్రకారంగా ఆసీనులయ్యే వారు ఊరేగారు. అల్లావారు ఊరేగడాన్ని, ఆ ఊరేగింపుకే ఒక వికాసమూ, ఘనతా ఏర్పడ్డాయి.

కాంగ్రెస్ పెండాల్ నుంచి ప్రతినిధులనూ, ప్రేక్షకులనూ కూడా బయటకు పంపించ వలసివచ్చింది. ఆ కార్మికులు సుమారు రెండు ఘంటలసేపు ఆ ప్రదేశాన్ని ఆక్రమించుకొని ఉండి, వారికున్న కష్టాలు సుదీర్ఘంగా విన్నవించుకున్నారు. కాంగ్రెసు నాయకులు వారిని శాంతపరచడానికి ప్రయత్నిస్తూ ఇచ్చిన ఉపన్యాసాలలో - కాంగ్రెసు వారిసహకారం వారి కెప్పుడూ ఉంటుందని వాగ్దానం చేశారు. భారతదేశంలో అప్పటికప్పుడె కార్మికోద్యమం బ్రహ్మాండంగా ప్రాకి, కేంద్ర రాష్ట్రీయ స్థాయిలలో ఎన్నుకోబడ్డ నాయకుల మార్గదర్శకత్వం తోచాలా ముమ్మరంగానే సాగుతోంది. కాంగ్రెసువారే గనుక 1921 నుంచీ గాని, అధమం 1930 నుంచీగాని ఈ కార్మికుల సంఘాలనీ, వారి కష్టసుఖాలనూ గమనిస్తూ, వారితో పొత్తు కలిగి ఉండి ఉంటే, బహుశ: మనకి రాజకీయ స్వాతంత్ర్యం ఎప్పుడో చులాగ్గానే వచ్చేసి ఉండేది.