పుట:Naajeevitayatrat021599mbp.pdf/443

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాంగ్రెసు పార్టీలకు తాకీదు

ఆ ఏడాదిలో మాకు కలిగిన అపజయాలకు ముఖ్య కారణం కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూ కాంగ్రెసువారిలో, తమ లోటుపాట్లు వల్ల ఏకీభావం సన్నగిల్లి పోవడం. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీలలో కూడా ఒకే మాట మీదా, ఒకే త్రాటిమీదా ఉందామన్న భావం సన్నగిల్లి పోయింది. అల్లా వారిలో వారికి భేదాభిప్రాయాలు ఉత్పన్నం అవడానికి కారణం నోఛేంజర్లుగానూ, ప్రోఛేంజర్లగానూ కాంగ్రెసువారు రెండు పార్టీలుగా చీలిపోవడమే.

వారు నిజంగా కలిసేవుండి సహనభావంతో వ్యవహరించి ఉండి ఉంటే దేశంయొక్క శక్తి బాగా వృద్దయి, పల్లె పల్లెలలోను కాంగ్రెసువారి ప్రభావం పెరిగి, ఊరూరా వారికి ఉండే నిర్మాణాత్మక శక్తి వేళ్లుబారి చక్కగా నాటుకు పోయియుండేది. వారు కోరిన కోర్కెలు కాదనడాని కెవ్వరికీ తరంగాకుండా ఉండేది.

1928 అక్టోబరు మాసం నాటికి పండిత మోతీలాల్‌నెహ్రూగారి అంతరంగిక స్థితి దిగజారి పోయింది. మనస్సులో మాట పైకి చెప్పక పోయినా, అంతరంగంలో మాత్రం ఆయన ఒక నిశ్చయానికి వచ్చాడు. కౌన్సిల్ కార్యక్రమాన్ని విస్మరించి గాంధీగారినే తిరిగి ఆశ్రయించాలని నిశ్చయించుకున్నాడు. అఖిల పక్ష సమావేశం వారి ప్రతిపాదన ప్రభుత్వంవారు ముందుగా పరిశీలించి, 1929 డిసెంబరు 31 లోపల అంగీకరింపకపోతే, శాసన ధిక్కారం అమలు జరుపుతామని విశదీకరించాము.

కౌన్సిల్ పోగ్రాం విస్మరించడానికి ప్రాతిపదికగా, మదరాసు కాంగ్రెస్ వా రామోదించిన బహిష్కరణ తీర్మానాన్ని సరిగా అమలు పరచనందుకు మీపై ఎందుకు చర్య తీసుకోకూడదని వివిద రాష్ట్రాల కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీలవారి నడిగాము. 1928 లో డిల్లీలో జరిగిన అఖిల భారత కాంగ్రెసు సంఘ సభలో ఈ ప్రసక్తి తీసుకురాబడింది. అంటే - కలకత్తా కాంగ్రెస్ ఇంకా రెండు మాసాలకు జరుగుతుందనగా ఈ ప్రశ్న వచ్చిందన్నమాట!