పుట:Naajeevitayatrat021599mbp.pdf/431

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మోతీలాల్‌తో పడని కారణం

మోతీలాల్ - లజపతిరాయ్‌గార్ల మధ్య ఆ అభిప్రాయ భేదాలకు కారణాలు తెలుసుకోడానికి నా కంటె మిన్నగా ఎవ్వరికీ సావకాశంలేదు. ఎంత ప్రయత్నించినా నాకు వారి అభిప్రాయ భేదాలకి కారణాల అంతూ పొంతూ దొరకలేదు. ఒక్కటి మాత్రం నిజం - ఇరువురూ మేధా సంపత్తిలో ఉద్ధండ పిండాలే. మోతీలాల్‌నెహ్రూగారి నిరంకుశ విధానమూ, ఆయనకున్న అహంకారమూ లజపతిరాయ్‌గారికి కిట్టకపోయి ఉండవచ్చు. ఆయన నాయకుడి చేతిమీదుగా తాను పొందుతూన్న గౌరవ మర్యాదల కంటె అధికంగా వాంఛించి ఉండవచ్చు. ఇంకాస్త ఇదిగా ఆయన చూపి ఉండి ఉంటే, వారిరువురిమధ్యా యేతగాదా ఉండేదికాదు. అసెంబ్లీ పార్టీలో ఉన్న ఇతర వ్యక్తులిచ్చిన అభిప్రాయాల కంటే, సలహాల కంటే, తానిచ్చిన సలహాలూ, వగైరా ఇంకా ఎక్కువ ఆదరణ పొంది ఉండవలసినదని ఆయన ఉద్దేశం అయి ఉండవచ్చు. ఆయన గాంధీగారి శిష్యుడు కాదుగా! ఎంత విభేదాలున్నా, మాలో మేము కీచులాడుకుంటూన్నా, నాయకుడితో అభిప్రాయ భేదా లొచ్చినా "బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామీ"గా తయారయి, మా పార్టీనే మేము అంటిపెట్టుకుని ఉండేవారం.

ఒకనాడు నేను అసెంబ్లీలో ప్రవేశిస్తూ ఉండగా లజపతిరాయ్‌గారు కాంగ్రెసుపార్టీని వదలి, మదన మోహన మాలవ్యాగారి లిబరల్ పార్టీలోకి మారడం చూశాను. నాకు నిజంగా విస్మయమూ, దిగులూ కూడా జనించడంచేత, "ఏమిటిది, ఇల్లా చేశా"రని అడిగాను. ఆయన ఇచ్చిన క్లుప్తమయిన సమాధానం: "ప్రకాశంగారూ, నేనే గనుక ఆయనతో నెగ్గుకు రాగలిగితే ఇల్లాంటి పనిచేస్తానా?" అన్నాడు. ఏదయితేనేం, మోతీలాల్ నెహ్రూ మహా మేధావీ, గౌరవ మర్యాదలకోసం ప్రాకులాడే వ్యక్తే అయినా, ఆయనకి శ్రీనివాసయ్యంగారూ, లజపతిరాయ్, రంగయ్యర్‌లాంటి వ్యక్తులను కూడగట్టుకుని ముందుకు సాగడం చేతకాదనే అనవలసి ఉంటుంది.