పరిస్థితులకు దారితియ్యకుండానే వైస్రాయ్గారికి జేరింది. వెంటనే ఆయన కలుగజేసుకుని, హోం మెంబర్ని జరిగిన పొరపాట్లను సరిదిద్దుకో వలసిందని బలవంతం చేశాడు. హోం మెంబరు వెంటనే తగురీతిని అవసరమయిన పదజాలంతో క్షమార్పణ కోరడమూ, పార్లమెంట్ సభ్యులందరి తరపున మోతీలాల్ నెహ్రూగారు ఆ క్షమార్పణను అంగీకరించడమూ జరిగింది. ఆ తర్వాత ఉద్రిక్తత తగ్గి, శాంతి నెలకొంది. అది మా అధ్యక్షునకు ఒక విజయమైంది. ఆ విధంగా పార్లమెంట్లో ఒక నూతన మర్యాద (Convention) ఏర్పడ్డం జరిగింది.
పబ్లిక్ సేఫ్టీ బిల్లు
1928, 1929 సంవత్సరాల పరిపాలనా విధానంలో భయాందోళనలదే పైచెయ్యి అయింది. వైస్రాయ్గారు తమ పరిపాలనంతా ఆర్డినెన్సులమీదనే నడిపించారు.
సెప్టెంబరు 17 న శాండ్హర్స్ట్ (Sandhurst) అనే ఒక పోలీసు ఆఫీసర్ని ఖూనీ జేశారు. దాన్తో ఆర్డినెన్సులూ, కుట్ర కేసులూ బనాయింపబడ్డాయి. పైగా పబ్లిక్సేఫ్టీ (ప్రజారక్షణ) బిల్లు అంటూ ఒకటి మన నెత్తిని రుద్దడానికి ప్రయత్నాలు జరిగాయి. అందుమీదట కుట్రకేసు ప్రాముఖ్యాన్ని వహించింది. ఈ ప్రజారక్షణకంటూ ప్రవేశబెట్టబడిన బిల్లు, ఆ మీరట్ కుట్రకేసును తారుమారుచేసి, అధ్వాన్న పరిస్థితులలో పడుతుందేమో ననిపించింది.
పరిస్థితులను గమనించిన శాసన సభాధ్యక్షుడు విఠల్భాయ్, ఒక ప్రకటన చేశాడు. అందులో అతి జాగ్రత్తగా పరిశీలించిన అనంతరం తాను ఒక నిశ్చయానికి వచ్చాననీ, ఆ నిశ్చయం ప్రకారం అటు మీరట్ కుట్రకేసు నడుస్తూండగా ఇటు ఈ పబ్లిక్ సేఫ్టీ బిల్లు ప్రతిపాదించడం చాలా ఆక్షేపణీయం, అందువల్ల ప్రభుత్వంవారు ఈ రెంటిలో ఒక దానిని వదులుకోక తప్పదని సూచించబడింది.
ప్రభుత్వంవారు అదేం కుదర దన్నారు. దాన్తో 1928