పుట:Naajeevitayatrat021599mbp.pdf/361

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రతికూల కక్షల దుష్ఫలితాలు

నిజానికి కాంగ్రెసుపార్టీవారే గనుక తమ విధానంలో నిబ్బరమూ నేర్పూ కనబరుస్తూ, గ్రామాలలో నిర్మాణ కార్యక్రమం సరిగా కొనసాగించి ఉండిఉంటే, కొద్ది సంవత్సరాలలోనే అది బాగా బలాన్ని పుంజుకుని ప్రభుత్వంవారి ముక్కు నలిపి మరీ, అధికారం చేపట్టగలిగి ఉండేది. కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూ, అధిక సంఖ్యాకులుగా ఎన్నిక అయిన కాంగ్రెసువారు, గట్టిగా తలపెడితే దేశంలో ఉన్న జన బాహుళ్యాన్ని సరిఅయిన త్రోవను నడపి, వారికి మంచి చెడ్డలు తెలిపి, గ్రామాలను పునర్నిర్మించడానికి వారు శాసన సభ్యులుగా చేస్తూన్న సేవకు భంగం రాకుండానే, ఎన్నో విధాల దేశాన్ని పునరుద్ధరించగలిగి ఉండేవారు.

కాని గాంధీగారి నాయకత్వాన నడుస్తూన్న నోఛేంజర్లూ, మోతిలాల్‌నెహ్రూగారిని అంటిపెట్టుకుని ఉన్న ప్రోఛేంజర్లూ భిన్నాభిప్రాయులై ఉండడాన్ని, ఒకరి దృష్టికి ఆనింది రెండవవారికి ఆనకుండా పోయింది. నోఛేంజర్లు శాసన సభల మూలంగా నూలు వడకడమూ, నేయించడములాంటి నిర్మాణ కార్యకలాపాలుగాని, హిందూ మహమ్మదీయ ఐకమత్య సాధనకు కృషిగాని చేయలేని స్థితిలోకి దిగజారారు. ప్రోఛేంజర్లెప్పుడూ నో ఛేంజర్లను అనుమాన దృష్టితోనే చూసేవారు. కాగా ఖాదీ కార్యక్రమం అంటే వారికి ఒకవిధమయిన అలసభావం ఉండేది. ఈ రెండు రకాల కాంగ్రెసు వారి మధ్యా నలుగుతూన్న జనం తాము ఏం చెయ్యాలో అర్థంకాని స్థితిలో ఉన్నారంటే ఆశ్చర్యపడనవసరం లేదు. శాసన సభ్యులు ప్రజలతో సంబంధ బాంధవ్యాలు లేనివారిలా, తటస్థ విధానంగా బ్రతకజొచ్చారు. ఈ పరిస్థితులలో నో ఛేంజర్లు కౌన్సిల్ కార్యక్రమం ఎప్పుడు ఛిన్నాభిన్నం అవుతుందా, ఎప్పుడు సహకార నిరాకరణోద్యమం సాగిద్దామా అన్న ఆలోచనలో పడ్డారు. ఉప్పు సత్యాగ్రహం కారణంగా శాసన సభ్యులను బైటకు వచ్చివెయ్యండని ఆదేశం ఇచ్చే పర్యంతమూ ఇలాగే నడిచింది.