పుట:Naajeevitayatrat021599mbp.pdf/294

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గోపాలశాస్త్రి తరహా

అవసరమైన చికాకులకు లోనుగాకుండా ఉండాలనే ఉద్దేశంతో గోపాలశాస్త్రిగారు, తమ స్వంత ఆస్తి విక్రయించి నాలుగువేల రూపాయలు పోగుచేసి, ఆ సొమ్ము కూడా లోగడ జమ కట్టిన సామగ్రులకు తోడుగా జమ కట్టడంతో, లావాదేవీ లన్నీ సక్రమంగా, ఏ విధమయిన చికాకులూ లేకుండా అంతమయ్యాయి.

నేను ఆంధ్ర దేశానికి తిరిగివచ్చి, కాంగ్రెసుకు వెళ్ళడానికి సిద్ధపడేలోపల గోపాలశాస్త్రిగారు ఈ డబ్బును సమకూర్చుకుని, గాంధీగారితో మాటలాడి తగాయిదా పరిష్కరించవలసిందని నన్ను కోరారు. నేను ఈ నాలుగువేల రూపాయలు కాంగ్రెసు పెండాలులో గాంధీగారి చేతులలోనే స్వయంగా పోశాను. దాన్తో, అంతా ఒకప్పుడు తలచి నట్లు, నేను దుష్టుణ్ణీ, దొంగనీ కానని ఆయన తలచి ఉండాలి.

అప్పటికే నా సర్వస్వం దేశానికి అర్పణ అయిపోయింది. నాదీ అనుకోతగ్గ సెంటు భూమి కూడా మిగల్లేదు. నాకు కాణీ వరుమానం వచ్చే ఆస్తిపాస్తు లేవీ మిగల్లేదు. ఏ మాత్రం ఆస్తి మిగిలి ఉన్నా ఆ నాలుగువేలూ నేనే నా సొంత డబ్బునుంచే యిచ్చేవాడిని. ఈ నాలుగు వేలు రూపాయలూ గాంధీగారి చేతిలో పెట్టిన తర్వాత, దావా ఉపసంహరించబడింది. ఆ లావా దేవీలన్నీ ఆ ప్రకారం అంతమయ్యాయి.

ఇటువంటి విషమ పరిస్థితులలో నేను ఉన్నా, ఎవరో స్వలాభపరులు "స్వరాజ్య" పత్రిక తన ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేస్తోందని చెప్పిన కల్పిత కథలు విని గాంధీగారు నాపై దండెత్తినా, నేనెప్పుడూ బహిరంగంగాగాని, అంతరంగికంగాగాని బాధపడలేదు. నిజం నిలకడ మీద తెలియకపోదనే నమ్మిక నా కుంది. నన్ను అనేక విధాల చికాకుల పాలుచేసి, అల్లరి పెడదామని గట్టిగా తలపెట్టిన ప్రత్యర్ధులు ఉన్నా, నేను కాంగ్రెసును వదలకుండా అంటిపెట్టుకుని ఉండగలగడం నిజంగా ఒక గొప్ప విశేషమే.