పుట:Naajeevitayatrat021599mbp.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మంత్రివర్గంవారు చూపించిన జస్టిస్ అటువంటిది. వారు తమ పద్ధతి ప్రకారం చాలా క్రూరాతిక్రూరంగా ప్రవర్తించారు.

అశ్రుత పూర్వ పరిస్థితులలో, ప్రజలకూ పరిపాలకులకూ మధ్య, ఈ సంఘర్షణ ఇల్లా ఒకటి రెండు సంవత్సరాలపాటు సాగింది. ఆ తర్వాత పాలకుల పట్టుదలకే ప్రజలు తల ఒగ్గవలసి వచ్చింది. ఇది అనుశ్రుతంగా వస్తూవున్న హైందవ దుర్బలతా పరిణామం. ఇంకా కొంత కాలం యీ పోరాటం ప్రజలు సాగించగలిగి ఉంటే, ప్రభుత్వంవారు కాళ్ళబేరానికి దిగికుండా ఉండగలిగేవారు కారు. ప్రజలలో రవ్వంత ఆత్మశక్తి లోపించిన కారణంగా విజయం సాధించలేకపోయారు.

పాలకుల మొండిపట్టు

కాని చీరాల-పేరాల ఉదంతం మాత్రం గుంటూరు పన్నుల నిరాకరణ ఉద్యమంలాగే, హైందవ ఆత్మశక్తికి తార్కాణంగా నిలిచి పోయింది. జయం కనుచూపుమేర దూరంలో ఉంటూన్న సమయంలోనే, ప్రభుత్వంవారి బాధ్యతా రహితమైన మూర్ఖపు పట్టుదలవల్ల ప్రజలు ఇక్కట్ల పాలవడం తప్పలేదు. చీరాల-పేరాల యూనియన్ పరిపాలనను, స్వల్ప వ్యయంతో, ప్రజోపయోగకరంగా రూపొందిస్తామనీ, మునిసిపాలిటీగా మార్చని కారణంగా, ప్రజలకు ఏ విధమయిన కష్టనష్టములూ రానీయమనీ ఎన్ని విధాల హామీలు ఇచ్చి ఉన్నా, పరిపాలకులు వారి కోర్కెలను త్రోసిపుచ్చారన్నది పాలకుల పట్టుదలనీ, మూర్ఖతనే తెలియజేసింది.

తమకు ఉపయోగకరమైన విధంగా తమ పురపాలక విధానాన్ని సవరించుకుని, పాలన సాగిస్తామని అంటే, ఆ ఉత్తమమైన కోర్కెను మన్నించడం తమ ప్రాథమిక కర్తవ్యమైనా పానగలు ప్రభుత్వంవారు పట్టుదలే ప్రధానంగా పెట్టుకుని, ప్రజలను ఇక్కట్ల పాలుచేయడ మన్నది మరవడానికి వీలులేని విపరీత సంఘటన. ఈ విషయంలో ప్రభుత్వంవారి మూర్ఖతే బయటపడింది.