పుట:Naajeevitayatrat021599mbp.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వున్న ఇళ్ళనీ, వాకిళ్ళనీ విడిచి పెట్టించి, వారిని రామనగరు పరిసర ప్రాంతాలకు తీసుకొని పోవడం అంటే మాటలా?

చీరాల వాసులతోటీ, ఆంధ్రరత్నతోటీ నాకు మంచి ఐక్యతాభావం ఉంది. వారి కోరిక న్యాయమైనదేనన్న భావమూ నాకు ఏర్పడింది. ఆ ప్రాంతమంతా పురపాలక ప్రాంతంగా మార్చబడే పక్షంలో గ్రామీణులకు గోరంత లాభం చేకూరకపోయినా, కొండంత భారం, పన్నుల రూపేణా, నెత్తిన పడడం అన్నది ఖాయం. అటువంటి క్లిష్ట సమయం అది. అప్పట్లో చీరాల-పేరాల వాసులకూ, ఆంధ్రరత్నకూ ఇవ్వగలిగినంత చేయూత ఇచ్చాను. నేను లక్షలమీద సంపాదిస్తూన్న కారణంగానూ, బ్యాంకులలో నా ధనం మూలుగుతూన్న కారణంగానూ, నేను ఆ ఉదంత విజయానికి చాలావిరివిగా విరాళం ఇచ్చాను.

ఎర్ర చొక్కాల సేన

ఆంధ్రరత్న "రామదండు" అన్న పేరుమీద ఎర్ర చొక్కాల సేనని ప్రోగుచేశాడు. గాంధీ మహాత్ముడు యావత్తు భారత దేశాన్నీ ఉద్దరించాలని ప్రయత్నిస్తూ ఉన్న ఆ కాలంలో, ఆంధ్రరత్న చీరాల-పేరాల ప్రజల కోసం "రామదండు" స్థాపనతో ఒక విశ్వామిత్ర సృష్టే చేశాడు.

1921 లో గాంధీగారి అఖిల భారత సంచార కార్యక్రమం సందర్భంలో నేనూ వారితోపాటు చీరాల వెళ్ళాను. గాంధీగారు సహాయ నిరాకరణ ఉద్యమ ప్రథమ దినాలలో "కాంగ్రెస్ నోట్స్" అన్న పేరు మీద భారత దేశంలో కాంగ్రెసు కారణంగా జరిగిన సంఘటన లన్నింటినీ వివరించేవారు. ఆ పద్దతులమీదె ఆంధ్రరత్న "చీరాల-పేరాల నోట్స్"ను ప్రారంభించాడు.

బ్రాహ్మణత్వ ప్రదానం

ఆయన క్షుణ్ణంగా సంస్కృతం నేర్చినవాడూ, విద్యావేత్తా, పండితుడూ అవడం చేత హిందూమత సద్ధర్మాలనూ, మూల సూత్రా