పుట:Naajeevitayatrat021599mbp.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రూపొందించాం. కాంగ్రెసులో ప్యాసయిన తీర్మానాను సారం నిర్ణీతమయిన 21 భాషా రాష్ట్రాలలోనూ, కాంగ్రెసు ఖిలాఫత్, స్వయం సేవక దళాలు ఏర్పడడమూ, జాతీయ స్వయం సేవక దళం ఆవిర్భవించడమూ జరిగింది. అల్లా ఆరంభింపబడ్డ జాతీయ స్వయం సేవక దళం హిందూస్తాన్ సేవా దళ నామాన్ని స్వీకరించి, కొద్ది దినాలలోనే బ్రహ్మాండమయిన సంస్థగా రూపొందింది.

ఈ హిందూస్తాన్ సేవా దళం వారిచే శిక్షణ గరపబడుతూన్న వేలాది స్వయం సేవకులను చూడడం చాలా ముచ్చట గొలిపేది. ఈ సేవా దళం దేశీయ శాంతి దళ స్థాపనకి ప్రాతిపదిక అయింది. ఇది దినదినాభివృద్ది చెంది కాంగ్రెసు జరుగుతూన్న ప్రతి ప్రాంతంలోనూ ఎంతో సేవ జేసింది. కాని కొన్ని దుష్టగ్రహ కూటాలవల్ల ఈ సేవా దళం మూలపడి విచ్చిన్నం అయింది.

ఈ హిందూస్తాన్ సేవా దళానికి బులుసు సాంబమూర్తిగారు కొంతకాలం ఆధ్వర్యవం వహించారు.

ఏవో దుష్టఘడియలలో అనాలోచితంగా ఆ దళాన్ని విచ్చిన్నం చేసి ఉండకపోతే, 1922 లగాయితు నిత్య సంఘటనలుగా పరిణమించిన హిందూ-మహమ్మదీయ సంఘర్షణల సందర్భంలో అ దళంవారు అయా ప్రదేశాలలో ఉరికి, శాంతిస్థాపనాది కార్యక్రమాలలో ఎంతయినా ఉపయోగపడి ఉండేవారు.

కాగా, మిలిటరీలో చేరే సోల్జర్లూ, సిపాయీలూ, ఆఫీసర్లు వగైరా అందరూ ఏ ప్రకారంగా దేశ రక్షణాది విషయాలలో ఆత్మత్యాగానికి సర్వత్రా సిద్దం అనే ప్రమాణాన్ని తీసుకుంటారో అల్లాగే శాంతి భద్రతలను కాపాడడం కోసం శాంతియుతంగా, అహింసాత్మక పద్దతుల ప్రకారం మానవసేవ, దేశసేవా చేస్తామనే ప్రమాణాన్ని తీసుకున్న యీ హిందూస్తాన్ సేవా దళం వారికి కూడా డ్రిల్లూ, డిసిప్లినూ ఉండేవి.

అహమ్మదాబాదు కాంగ్రెసు సందర్భంలో ఈ దళం వారికి