పుట:Naajeevitayatrat021599mbp.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాంధీ అంటే కాంగ్రెస్సు, కాంగ్రెస్సంటే గాంధీ అన్న భావం ప్రబలింది. పరాయిప్రభుత్వ పరిపాలనా విధాన తో బానిస జీవనం గడుపుతూన్న లక్షలాది జనానికి గాంధీగారి మాటన్నా, కాంగ్రెసువారి ఆదేశమమన్న వేదవాక్కే అయిపోయింది. సాక్షాత్తూ భగవంతుడే గాంధీరూపంతో తమ్ము ఉద్దరించడానికి అవతరించాడనే భావం ప్రజలలో నాటు కుంది. అంటే అప్పట్లో దేశం గాంధీగారిలాంటి ఉత్తమ నాయకునికోసం ఎదురుచూస్తోందన్నమాట అటువంటి క్లిష్టసమయంలో గాంధీగారు ముందుకొచ్చి నాయకత్వం వహించేసరికి, పర్యవసానాలతో నిమిత్తం లేకుండా అగ్నిగుండంలోనికి దూకడానికిగూడా దేశవ్యాప్తంగా లక్షలాది జనం సంసిద్దులయ్యారు.

దేశాన్ని ఉద్దరించడానికి కంకణం కట్టుకున్న ఆనాటి నాయకులు, ఏరుదాటి ముందుకువేసిన అడుగు వెనక్కి తీసుకొని తిరోముఖం పట్టడానికి వీలులేని విధంగా, తమ్ము దాటించిన తెప్పల నన్నింటినీ తగులబెట్టారన్నమాట! కళాశాలలను విసర్జించి కాంగ్రెసులో జేరి జైళ్ళకు వెళ్ళిన విద్యార్థులు, ఉద్యమాన్ని విడిచిపెట్టి తిరిగి కాలేజీలలో జేరడానికి గాని, గవర్నమెంటు నౌకరీలను ఆశించడానికి గాని అణుమాత్రపు సావకాశంకూడా వుండేదికాదు. వారి జీవితాలు తప్పనిసరిగా ప్రజాసేవకి అంకితం అయిపోయాయన్నమాట!

కాంగ్రెసు సాధిస్తూన్న విజయాలు ప్రభుత్వంవారి కన్ను కుట్టాయి. దాన్తో నిర్మాణ కార్యక్రమ సాఫల్యాన్ని కూడా వారు సహించలేక పోయారు. నిర్మాణ కార్యక్రమం కారణంగా దేశమంతా ఒకే త్రాటి మీదకు వచ్చేస్తోందని నకనకలాడారు. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ రాక సందర్బంలో దేశం కనబరచిన నిరసనా, బహిష్కరణా అన్నవి మరపురానివే కదా! అందువలన ఈ నిర్మాణ కార్యక్రమం విధానాన్ని ఒక పెద్ద వెన్నుపోటు పోడవాలని గాంధీగారిని కారాగారానికి పంపించక పూర్వం నుంచీ పరిపాలకులు ఎన్నో పదకాలు వేస్తూనేవున్నారు.

ర్యాలి పంచాయతీ కోర్టు

తూర్పుగోదావరిజిల్లా సెంట్రలు డెల్టా రాజోలు తాలూకాకు