పుట:Naajeevitayatrat021599mbp.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాన్ని బల్లమీద వేసి, "చెప్పదలచుకున్న విషయం సమగ్రంగా చెప్పనియ్యకపోతే ఏం చెయ్యాలి?" అన్నాడు. ఆ ప్రతీకారంతో జడ్జీ చల్లబడ్డాడు.

ఇంక వి. కృష్ణస్వామయ్యరుగారి తరహా దీనికి పూర్తిగా వ్యతిరేకం. కృష్ణస్వామయ్యరుగారు నాకు లా కాలేజీలో ప్రొపెసరు. ఆయనకి న్యాయశాస్త్రంలో ప్రవేశం అమోఘం! అందుచేత గబాగబా తనకేసు విస్తరించేవాడు. ఎదటివాడిని మాట్లాడనిచ్చేవాడు కాడు. చూడడానికి మంచి దర్జాగా ఉండేవాడు. ఎదటివాడు ఏదైనా ఒక మాటంటే దానికి నాల్గుమాటలతో జవాబు చెపితేకాని ఆయనకి తృప్తి ఉండేదికాదు. పి. ఆర్. సుందరయ్యరు మంచి మేధావి. ఎదటివాడు నొవ్వకుండా తనకేసు సుస్పష్టంగా చెప్పగలిగేవాడు. ఇప్పటి సర్ పి. యస్. శివస్వామయ్యరుగారుకూడా అప్పటికి సీనియర్లలో వాడే. లాలో చాలా పండితులైనా, కేసు చెప్పడంలో ఈ ప్రజ్ఞావంతులకి అందేవాడుకాడు.

ఇక తెలుగులాయర్ల సంగతి కొంచెం వ్రాస్తాను. వేపా రామేశం (ఇప్పుడు సర్), పురాణం నాగభూషణం, రంగావఝ్ఝుల నాగభూషణం, యల్లెపద్ది వెంకట్రామశాస్త్రిగార్లు ఏదో మర్యాదగా కాలక్షేపం చేస్తూఉండేవారు. వాళ్ళు ఎవ్వరూకూడా దాక్షిణాత్య న్యాయవాదుల ధాటికి నిలబడలేని స్థితిలోనే ఉండేవారు. నేను రాజమహేంద్రవరంలో ప్లీడరుగా ఉండి, పెద్దకేసులు హైకోర్టుకి పట్టుకువచ్చి, వీరిని సలహా చేస్తే ఏ అయ్యర్‌కో, ఏ అయ్యంగారికో - లేకపోతే క్రిమినల్ కే సయితే ఏ ఆడమ్సుకో - అప్పచెప్పి వారిదగ్గిర సహాయకులుగా పనిచేస్తూ ఉండేవారు. అందుచేతనే ఆంధ్రదేశంలో జమీందారీలు ఎన్ని ఉన్నా, వాటి తాలూకు పెద్దకేసు లన్ని అరవప్లీడర్ల చేతుల్లోనే ఉండేవి. భాష్యంఅయ్యంగారు, కృష్ణస్చామయ్యరుగారు మొదలయిన పేరుకెక్కిన వకీళ్ళ ఐశ్వర్యం అంతా ఈ జమీందారుల వల్ల సంపాదించినదే. ఆ కాలంలో మదరాసులో ప్లీడరీ స్థితి ఇది.