పుట:Naa Kalam - Naa Galam.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎన్నికైనారు.

ఆ నేపథ్యంలో బహుశా అప్పటికి తొలిసారిగా రాష్ట్రానికి వస్తున్న శ్రీ రాజీవ్‌గాంధి సందర్శనార్థం దాదాపు రెండు లక్షల మంది రైతు, కూలీలు అత్యుత్సాహంతో పాల్గొన్నారు. అంతకు పూర్వం విజయవాడలో శ్రీ సంజయ్ గాంధికి అత్యంత సన్నిహితుడైన శ్రీ రాజేష్‌ పైలట్‌ ఇంగ్లీషు ఉపన్యాసాన్ని, ఆయనతోపాటు అప్పటి కేంద్ర ఆరోగ్యశాఖామంత్రి శ్రీ బి. శంకరానంద్‌ ప్రసంగాన్ని నేను తెలుగులోకి తర్జుమా చేశాను. అప్పుడే శ్రీ రాజేష్‌ పైలట్‌ అన్నారు. "మేడం ఇందిరాగాంధి ఆంధ్ర ప్రాంతానికి వచ్చినప్పుడు ఆమె ఉపన్యాసాన్ని శ్రీ తుర్లపాటి తర్జుమా చేస్తే ఆమె చాలా సంతోషిస్తారు" అని.

రాజేష్‌ పైలట్‌ రాజీవ్‌గాంధికి అనువాదకుడుగా నా పేరును శ్రీ సుభాష్‌ చంద్రబోసుకు సూచించారట! అందువల్ల, భీమవరం సభలో శ్రీ రాజీవ్‌ ఉపన్యాసాన్ని తర్జుమా చేయాలని శ్రీ సుభాష్‌ బోసు నన్ను ఆహ్వానించారు. నేను సభకు ముందు రాత్రే భీమవరం వెళ్లాను.

మరునాడు ఉదయం పది గంటలకు సభకు శ్రీ రాజీవ్‌గాంధి హైదరాబాద్‌ నుంచి హెలికాఫ్టర్‌లో వచ్చారు. సభకు వచ్చిన ముఖ్యమంత్రి శ్రీ అంజయ్య కూడా వేదిక పై వున్నారు. శ్రీ సుభాష్‌ ప్రారంభ వచనాల తరువాత శ్రీ రాజీవ్‌ గాంధి ఉపన్యాసం ప్రారంభించారు. అప్పటికి ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసి ఎక్కువ కాలం కాలేదు. రాజకీయాలన్నా, బహిరంగ ఉపన్యాసమన్నా ఆయనకు కొత్తే! అందులోను అప్పటిలో ఆయన గొంతు పీలగా, మంద్రస్వరంలో వుండేది. ఆయన మాట మైక్‌లో నుంచి పెద్దగా దూరానికి వినిపించంలేదు. దాదాపు ఫర్లాంగు దూరం వరకు జనం వున్నారు!

శ్రీ రాజీవ్‌ ఉపన్యాసాన్ని నేను తర్జుమా చేయడం ప్రారంభించాను.