పుట:Naa Kalam - Naa Galam.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"నేను మళ్లీ పుట్టాను!"

ఔను! ప్రతి వ్యక్తి, లేదా ప్రతి ప్రాణి ఒకసారి పుడతారు; మరి, మళ్లీ పుట్టమేమిటి?

అప్పుడు నా వయస్సు 13, 14 సంవత్సరాలు వుంటాయి. "ట్రిపుల్‌ టైఫాయిడ్‌" వచ్చింది. అప్పటిలో జ్వరం వచ్చిందంటే, వైద్యులు "లంకణం పరమౌషధం" అనే వారు! నా చేత 108 రోజులు లంకణాలు కట్టించారు. అది 1946వ సంవత్సరం. అన్ని రోజులూ కేవలం కాఫీ, గ్లూకోజ్‌ వాటర్‌ మాత్రమే ఇచ్చారు. ఆ రోగి, అందులోను వేసంగిలో, ఏమౌతాడు?

మూడు నెలలు దాటిన తరువాత నీరసించిపోయాను. చివరికి స్పృహలేని పరిస్థితి! ఒక రోజు అయితే, ప్రాణం పోయిందనే భావించారు. మంచం పై నుంచి దించి కింద పడుకోబెట్టారు! ఏడుపులు, చుట్టు ప్రక్కల వారిలో సంచలనం! ప్రక్క ఇంటి ముసలావిడ ఊరగాయ జాడీలు "మైల" పడిపోతాయని ఇంటిలో నుంచి దొడ్లోకి చేరవేసింది!

ఆ పరిస్థితిలో డాక్టర్ వచ్చి, స్మెల్లింగ్‌ సాల్ట్‌ వాసన చూపించి, కొన్ని వైద్య ప్రక్రియలు చేసేసరికి నాడీ చలనం, హృదయ స్పందన కనిపించినవట! "ప్రాణం వున్న" దని డాక్టర్ సంతోషంతో చెప్పే సరికి తిరిగి మంచంపై పడుకోపెట్టారు! అందరిలో తిరిగి ఆనందహేల!

అంతే! ఇక క్రమంగా కోలుకోసాగాను. అప్పటిలో నాన్న గారు సుందరరామానుజరావు గారు గన్నవరంలో ప్లీడర్‌గా ప్రాక్టీసు చేస్తున్నారు. మేము అప్పుడక్కడే వుండే వారం. ఆ తరువాత అయిదారు నెలల వరకు మంచం దిగలేక పోయాను!

అప్పుడే దిన పత్రికలు చదవడం ప్రారంభించాను. ఆ రోజులలో