పుట:Naa Kalam - Naa Galam.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వున్నాను.

డాక్టర్ పట్టాభి మచిలీపట్నంలో ఒకప్పుడు పేరెన్నికగన్న డాక్టర్. ఆయన ఎమ్‌.బి.సి.ఎమ్‌. (ఎమ్‌.బి.బి.ఎస్‌. వంటి అల్లోపతి వైద్య డిగ్రీ). ఆయన మహాత్మాగాంధికి అగ్రశ్రేణి శిష్యుడు. 1939లో త్రిపుర కాంగ్రెస్‌ మహాసభ అధ్యక్ష పదవికి శ్రీ సుభాష్‌చంద్రబోస్‌తో పోటీకి గాంధీజీ డాక్టర్ పట్టాభిని తన అహింసా సిద్ధాంత భాష్య కారుడుగా నిలబెట్టారు. బోసుది బ్రిటీష్‌ సామ్రాజ్యవాద ప్రభుత్వంపై సాయుధపోరాటపథం. ఆ పోటీలో పట్టాభి ఓటమిచెందినప్పుడు గాంధీజీ "పట్టాభి ఓటమి నా ఓటమి" అన్నారు. ఎందువల్లనంటే, ఆయన తన అభ్యర్ధి కాబట్టి! అంతేకాదు - "అహింసా సిద్ధాంతానికి వైశ్యుడనైన నేను సూత్రకారుడినైతే, బ్రాహ్మణుడైన పట్టాభి భాష్యకారు"డని కూడా గాంధీజీ ఒకసారి అన్నారు. గాంధీజీకి ఆయన అంతగా సన్నిహితుడు.

అయితే, ఆంధ్ర రాజకీయాలలో మాత్రం ఆయన "ఆంధ్రకేసరి" ప్రకాశం గారికి ప్రతికూలుడు. వారిద్దరి మధ్య వైషమ్యాలంటూ ఏమీలేవు. ఆయన జయపూర్‌ కాంగ్రెస్‌ మహాసభకు అధ్యక్షుడుగా ఎన్నికైనారు. గాంధేయ ఆర్ధిక విధానాలను గురించి ఆయన క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. అందువల్ల, స్వతంత్ర భారత ప్రథమ ప్రభుత్వంలో డాక్టర్ పట్టాభి ఆర్ధికమంత్రి కాగలరని చాలా మంది భావించారు. కాని, ప్రధాని నెహ్రూకు, ఆయనకు విధాన వైరుధ్యం వుండేది. అందువల్ల, పట్టాభికి బదులుగా సర్‌ ఆర్‌.కె. షణ్ముగం చెట్టియార్‌ను ఆర్ధిక మంత్రిగా నెహ్రూ నియమించారు. స్వతంత్ర భారత ప్రభుత్వంలో పట్టాభిని మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా నియమించారు.

ఆ రోజులలో నేను టంగుటూరి ప్రకాశం నాయకత్వ వైశిష్ట్యాన్ని గురించి ఎన్నో వ్యాసాలు రాశాను. ఆయన పై రాసిన పుస్తకం కాపీని డాక్టర్