పుట:Naa Kalam - Naa Galam.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్పృహలోకి వచ్చిన శ్రీరాములుగారి చెవిలో గట్టిగా చెప్పడం వినిపిస్తున్నది. ఆయన గద్గద స్వరంతో "నెహ్రూ ఆంధ్రరాష్ట్రం ఇస్తానన్నాడా?" అని ఎదురు ప్రశ్న వేశారు. "ఇంకా ఏ ప్రకటనా రాలేదు. ఏదో క్షణంలో వస్తుంది. మీరు దీక్ష విరమించండి". అని ప్రకాశం గారు చెప్పారు. కాని, శ్రీరాములు గారు ఏమీ మాట్లాకుండ విరమించనన్నట్టు చెయ్యి వూపి, ఆ గోడవైపు తిరిగి పడుకున్నారు. అదీ ఆయన పట్టుదల!

అంతకు పూర్వం బహుశా 1952 మే నెలలో అనుకుంటాను, విజయవాడ నాస్తిక కేంద్రంలో జరిగిన సర్వోదయ మహాసభలో శ్రీరాములు గారిని చూశాను. అప్పుడు ఆయన నల్లగా, దృఢంగా వున్నారు. కాని, నిరాహార దీక్ష 50వ రోజున చూచినప్పుడు ముఖం తెల్లగా పాలి పోయింది రక్తహీనతతో. కళ్లు ఎక్కడో లోతుకుపోయాయి. చిక్కి శల్యావశిష్టంగా వున్నారు.

ఆ మరునాడు - డిసెంబరు 8వ తేదీన కూడా - మద్రాసులో వున్నాము. నెహ్రూ నుంచి టెలిగ్రామ్‌ వచ్చింది. ఆంధ్రరాష్ట్రం ఇస్తున్నామని కాదు - ఆంధ్రరాష్ట్ర నిర్మాణ సమస్యను పరిశీలిస్తున్నామని! ఆ టెలిగ్రామ్‌ తీసుకుని, ప్రకాశం, బులుసు సాంబమూర్తి ప్రభృతులు శ్రీరాములు గారి వద్దకు వెళ్లారు. సాంబమూర్తి గారు శ్రీరాములు గారి చెవిలో నెహ్రూ టెలిగ్రామ్‌ విషయం గట్టిగా చెప్పారు.

"నెహ్రూ ఆంధ్రరాష్ట్రం ఇస్తానన్నాడా?" అని ఆయన గద్గద స్వరంతో ప్రశ్నించారు. "పరిశీలిస్తున్నారట!" అని సాంబమూర్తి గారు చెప్పారు. "అబ్బే!" అని శ్రీరాములు గారు దీక్ష విరమించనన్నట్టు చేతులు వూపి, గోడ వైపు తిరిగి పడుకున్నారు! అంతే! 1952 డిసెంబరు 15వ తేదీ రాత్రి ఆయన ఆంధ్రరాష్ట్రం కోసం ఆత్మబలిదానం చేసిన అయిదవ రోజున కాని - 19వ తేదీన - ప్రధాని నెహ్రూ ఆంధ్రరాష్ట్రాన్ని నిర్మిస్తున్నట్టు ప్రకటించలేదు. ఈ