అయితే, అది ఎన్నికల సమయమైనందున, పండిట్ నెహ్రూ ఏ రోజున ఎక్కడ వుంటారో చెప్పలేమని, అందువల్ల ఆయనకు చెప్పదలచుకున్నది ఒక లేఖ ద్వారా తెలియజేస్తే, పరిశీలిస్తామని ఆయన తరఫున కార్యదర్శి శ్రీ ఎస్.పి. ఖన్నా నాకు ప్రత్యేకంగా లేఖ రాశారు.
నెహ్రూతో సమావేశం
ఇలా వుండగా, 1951 డిసెంబర్ 27న ప్రధాని నెహ్రూ ఎన్నికల ప్రచారానికి విజయవాడ వచ్చారు. విజయవాడ పి.డబ్ల్యు.డి. గ్రౌండ్స్లో జరిగిన బ్రహ్మాండమైన సభలో ఆయన ప్రసంగించారు. నేను ఆ సభకు హాజరైనాను. సభానంతరం ఆయన స్పెషల్ రైలులో ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి మొదలైన చోట్ల ఎన్నికల ప్రచార సభలలో ప్రసంగించవలసివున్నది. అందువల్ల, నేను నెహ్రూ ఉపన్యాసం పూర్తికాకుండనే ఆ సభ నుంచి బయటికి వచ్చి, రైలు స్టేషన్కు వెళ్లే ప్రయత్నంలో వున్నాను.
సంజీవరెడ్డి పై చెయ్యి చేసుకున్న నెహ్రూ!
ఆ సమయంలో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది! నెహ్రూ తన ఉపన్యాసం ముగించి, అప్పటి ఆంధ్రరాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ నీలం సంజీవరెడ్డి ప్రభృతులతో టాపులేని జీపులో రైలుస్టేషన్ వైపు వెడుతున్నారు. ఆయన చేతిలోని గులాబీదండకోసం ఒక బాలుడు జీపు వెంట పరుగెత్తుతున్నాడు. అతడి చేతికి ఆ దండను అందించుదామని నెహ్రూ ఎంత ప్రయత్నించినా, అతడు అందుకోలేకపోతున్నాడు. చివరికి ఆ కుర్రవాడు జీపును సమీపించేసరికి శ్రీ సంజీవరెడ్డి అతడిని చేతితో నెట్టి వేసే సరికి అతడు కింద పడి పోయాడు! ఆ బాలుడి పట్ల జరిగిన దౌర్జన్యాన్ని సహించలేని "చాచా